
ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులా?
యడ్లపాడు: కూటమి ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి డిమాండ్ చేశారు. యడ్లపాడు పీఆర్ విజ్ఞాన కేంద్రంలో కె.బుజ్జి అధ్యక్షతన ఆశవర్కర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆశ వర్కర్ల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేసి తీరా అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినా నేటికీ ఒక్క సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించలేదన్నారు. పైగా రాజకీయంగా స్థానిక టీడీపీ నాయకులే వేధింపులకు గురి చేయడం, ఆశ వర్కర్లను తమ విధుల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టాక ప్రస్తుతం చేస్తున్న చిరుద్యోగులను తొలగిస్తున్న విషయాలను గమనించి న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు రెడ్కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. బ్రిటీష్ కాలానికి ముందే పోరాడి, ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేవలం నాలుగు కోడ్లుగా మార్చి తీరని ద్రోహం చేస్తుందన్నారు. దీనిని నిరసిస్తూ జులై 9వ తేదీన జరిగే ఆశ వర్కర్ల సమ్మెలో అందరూ భాగస్వాములై తమ సమస్యల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని పిలుపునిచ్చారు.
కొత్త కమిటీ ఎన్నిక
సమావేశం అనంతరం ఆశ వర్కర్ల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షురాలు పి.నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎం.మల్లేశ్వరి, పి.సుశీల, ప్రధాన కార్యదర్శి వేళంగిని దేవి, కోశాధికారి, సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి యడ్లపాడు పీహెచ్సీలో సమావేశం జూలై 9న సమ్మెకు సిద్ధం కావాలంటూ పిలుపు