
అవుట్ సోర్సింగ్ కార్మికుల నిరసన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ కార్యాలయాల్లోని ఇంజినీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికల సంఘాల జేఏసీ చైర్మన్ మధుబాబు తెలిపారు. శుక్రవారం కార్మిక సంఘాలతో కలిసి సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తమకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేదని వాపోయారు. కార్మికుల పట్ల ప్రభుత్వం, ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం సీడీఎంఏ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు.
పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు నేడు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి