
పెరిగిన పెట్టుబడి ఖర్చులు
ఒక్కో ఎకరాకు విత్తన పసుపు పుట్టి లెక్కన విత్తుతారు. ఒక్కో పుట్టి 225 కిలోలు ఉంటుంది. ప్రస్తుతం తూములూరు కేంద్రంలో విత్తన పసుపు పుట్టి రూ.5,800 నుంచి రూ.6,000 వరకు పలుకుతోంది. గతేడాదితో పోల్చితే ధర తగ్గింది. గతేడాది పుట్టి రూ.10 వేల వరకు విక్రయించారు. రైతులు ఒక్కో ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది పుట్లు విత్తన పసుపు వినియోగిస్తారు. అంటే ప్రస్తుత ధరల ప్రకారం పసుపు విత్తనానికి ఎకరాకు రూ.36 వేల నుంచి రూ.48 వేల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. పసుపు విత్తేందుకు ముందుగా చేలలో ట్రాక్టరుతో సాళ్లు తీసేందుకు రూ.4 వేలు, తర్వాత కూలీలతో పసుపు విత్తటానికి రూ.3 వేల చొప్పున ఖర్చవుతుంది. అంటే కేవలం పసుపు విత్తేవరకు మాత్రమే రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. మొత్తం పంట చేతికొచ్చేసరికి ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు అనివార్యం. పసుపు సాగుకు కౌలుకు తీసుకుంటే మరో రూ.55 వేలు అదనం. దిగుబడి తగ్గినప్పటికీ మార్కెట్ ధర బాగుంటే రైతులు ఒడ్డునపడే అవకాశం ఉంది. కానీ చేతికొచ్చేసరికి ఏ ధర ఉంటుందో తెలీని పరిస్థితి. గిట్టుబాటు ధర సంగతి అటుంచి క్వింటా ధర కనీసం రూ.11 వేలు ఉండాలని రైతులు తమ ఆకాంక్ష వెల్లడించారు.