ఇవేం కష్టాలు బాబోయ్‌! | - | Sakshi
Sakshi News home page

ఇవేం కష్టాలు బాబోయ్‌!

Jun 27 2025 4:22 AM | Updated on Jun 27 2025 4:22 AM

ఇవేం

ఇవేం కష్టాలు బాబోయ్‌!

నగరంపాలెం, నెహ్రూనగర్‌: గుంటూరు నగరంలో గురువారం;సీఎం చంద్రబాబు పర్యటన, అవగాహన ర్యాలీ దెబ్బకు ‘ఇవేం కష్టాలు బాబోయ్‌’ అని ప్రజలు, వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పేరుతో కార్యక్రమం జరిగింది. దీంతో సాయంత్రం వేళ విద్యాసంస్థలు, కార్యాలయాల నుంచి నివాసాలకు వెళ్లేందుకు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఫీవర్‌ ఆసుపత్రి నుంచి చిల్లీస్‌ వరకు వాకథాన్‌ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో అమరావతి రోడ్డు నుంచి ఫీవర్‌ ఆసుపత్రి, వయా చిల్లీస్‌ వరకు రెండు వైపులా రహదారిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించి ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేశారు.

ఎటు తిరిగి వెళ్లినా బారికేడ్లే

అమరావతి రోడ్డుకు మొదట ఉన్న ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో చోదకులు, పాదచారులు నాయుడుపేట, శ్రీనగర్‌ వైపు చుట్టూ తిరిగి వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ అమరావతి రోడ్డు మీదుగా వెళ్తే కొద్దిదూరం బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. కనీసం అక్కడి నుంచి దగ్గరలో ఉన్న నివాసాలలో ఉండే వారిని కూడా వాహనాలు సహా ఆవేశారు. దీంతో పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్తున్న చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. అదే బారికేడ్లకు సమీపాన ఉన్న పెట్రోల్‌ బంక్‌లో ఆయిల్‌ కొట్టించుకుంటామని ప్రాధేయపడినా పోలీసులు తొలగించలేదు. ఇద్దరు సీఐలు మాత్రం మరింత అత్యుత్సాహం చూపారు. ద్విచక్ర వాహనం ముందుకు వెళ్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని ఓ సీఐ మొబైల్‌ ఫోన్‌ చేత్తో పట్టుకుని హల్‌చల్‌ చేశారు. పిల్లలను తీసుకొని వచ్చిన ఓ మహిళైతే ఇల్లు దగ్గరే అని చెప్పినా, అర్ధగంట తర్వాత మాత్రమే పంపిస్తానని పోలీసులు చెప్పారు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందేనని పోలీసులు చెప్పడంతో ఆమె మిన్నకుండిపోయారు.

సీఎం రాకతో అమరావతి రోడ్డులో అడుగడుగునా ట్రాఫిక్‌ ఆంక్షలు

ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనదారుల నిలిపివేత ఆమడ దూరంలోని ఇళ్లకు వెళ్లేందుకూ ప్రజలకు ఇక్కట్లు వర్షంలో తడిసి ముద్దయిన విద్యార్థులు, మహిళలు

నేడు ఏఐ 4 ఆంధ్రా పోలీస్‌ హ్యాకథాన్‌ ప్రారంభం

సీఎం చంద్రబాబు రాక

ప్రత్తిపాడు: ఏఐ ఉపయోగించి వినూత్న పోలీసింగ్‌, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ పోలీస్‌ శాఖ ‘ఏఐ 4 ఆంధ్రా పోలీస్‌ హ్యాకథాన్‌’ను ప్రారంభించనుంది. గుంటూరు రూరల్‌ మండలం చౌడవరంలోని ఆర్‌వీ ఆర్‌జేసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జరగనున్న హ్యాకథాన్‌లో తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇప్పటికే 60కుపైగా బృందాలు దేశ విదేశాల నుంచి పలు విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ఐటీ కంపెనీలు పేర్లు నమోదు చేసుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చాటిన బృందానికి రూ. 10 లక్షల నగదు బహుమతి, ఏపీ పోలీసు శాఖ నుంచి సర్టిఫికెట్లు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు.

ఇవేం కష్టాలు బాబోయ్‌! 1
1/1

ఇవేం కష్టాలు బాబోయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement