
బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకను కలసి వినతి పత్రం సమర్పించారు. వివిధ కేటగిరీలకు చెందిన 5,147 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా.. వారిలో కొంత మంది బదిలీ అయిన పాఠశాలలకు వెళ్లారన్నారు. మిగిలిన వారిలో ఎక్కువమంది పాతస్థానాల నుంచి రిలీవ్ కాలేదని పేర్కొన్నారు. వీరివల్ల మిగిలిన టీచర్లు సైతం ఆగిపోవాల్సి వస్తోందని, ఎంటీఎస్ టీచర్లతోపాటు సర్ప్లస్లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయడం ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు. క్యాడర్ వివరాలు అప్డేట్ చేసి, వేతనాలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేర్లను సంబంధిత ప్రైవేటు పాఠశాలలు డ్రాప్బాక్స్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఈవోను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి. వెంకటేశ్వర్లు, కె.సాంబశివరావు, ఎం.గోవిందు, బి. ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్కుమార్, ధన లక్ష్మి, ప్రసన్న ఉన్నారు.