
డయేరియాపై అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించి వ్యాధి బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ‘స్టాప్ డయేరియా క్యాంపెయిన్’పై వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ 16 నుంచి జూలై 31వ తేదీ వరకు జరిగే క్యాంపెయిన్లో ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జింక్, ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో సహజసిద్ధంగా కలిగే నీళ్ల విరోచనాలపై తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందన్నారు. క్యాంపెయిన్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు.