
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
అమరావతి: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. మండలంలోని నరుకుల్లపాడులో ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. వివరాలు.. మండలంలోని నరుకుళ్లపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నల్లిబోయిన వినోద్ గుంటూరులోనూ, బోదా గోపి సుద్దపల్లిలోనూ గత ఏడాదిగా తలదాచుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, తిరుపతిరావు, సీతారామయ్య మరి కొంతమంది కలసి నల్లిబోయిన వెంకటసుబ్బారావు, పెదవీరబాబు, చినవీరబాబు ఇంటిమీద దాడికి వెళ్లారు. మధ్యాహ్నమే వినోద్, గోపీలు వెళ్లిపోయారని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకుని పోలీసులు రావటంతో గొడవ సద్దుమణిగింది. ముందు జాగ్రత్త చర్యగా సీఐ అచ్చియ్య శనివారం రాత్రి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్సార్ సీపీకి చెందిన బొంతా శ్రీను, ఇంటి ముందు కూర్చుని పేపర్ చదువుకుంటుండగా టీడీపీ చెందిన చింకా వెంకటేశ్వర్లు కర్రతో దాడి చేయగా అతని ఎడమ చేతికి గాయమై అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇరువర్గాలను బైండోవర్ చేసినట్లు సీఐ అచ్చియ్య తెలిపారు.