
సైక్లింగ్ చాంపియన్ షిప్ నిర్వహణ అభినందనీయం
చీరాల: నియోజకవర్గంలో మొదటిసారిగా చీరాల సైక్లింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలను ఆదివారం ప్రారంభించారు. వాడరేవు నుంచి ప్రారంభించిన ఈ పోటీలను ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను 60 కిమీ, 20 కిమీల విభాగంలో నిర్వహించారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారులు, నాయకులు పాల్గొన్నారు. 60 కిమీ విభాగంలో విజేతలు సిద్ధార్థ్ లింగ్ (కర్ణాటక) రూ.లక్ష, అర్హద్ ఫరీద్ (ఢిల్లీ) రూ.50 వేలు, నవీన్ కర్ణాటక రూ.30 వేలు, 20 కిమీల విజేతలు ఎస్.అబ్రహాం (తమిళనాడు) రూ.50 వేలు, రాజు పాండీ (తమిళనాడు) రూ.30 వేలు, సోహెల్ రియాజ్ (మహారాష్ట్ర) రూ.20 వేలు బహుమతులు గెలుచుకున్నారు. చీరాల వన్టౌన్, రూరల్ సీఐలు ఎస్.సుబ్బారావు, పి. శేషగిరిరావు, ఎస్సైలు ఎ.చంద్రశేఖర్, పి. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర,
తమిళనాడు నుంచి క్రీడాకారుల రాక