
భార్యను హతమార్చి, గొంతు కోసుకున్న భర్త
● ఆసుపత్రికి తరలించిన పోలీసులు
● గుంటూరు కన్నవారి తోటలో ఘాతుకం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : భార్యపై అనుమానంతో గొంతు కోసి హత మార్చి.. తానూ గొంతు కోసుకొని భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గుంటూరు నగరంలోని కన్నవారితోటలో శనివారం మధ్యాహ్నం జరిగింది. మృతురాలు లక్ష్మి కుమారుడు శివ తెలిపిన వివరాల ప్రకారం...కన్నవారితోటలోని రఘురామ్నగర్ గోరీలదొడ్డి ప్రాంతానికి చెందిన దారబోయిన లక్ష్మి (40), భర్త రాజులకు ఇద్దరు సంతానం ఉన్నారు. లక్ష్మి ఇళ్లల్లో పని చేస్తుంటుంది. భర్త వంట పనులు, కూలీ పనులకు వెళుతుంటాడు. లక్ష్మికి 17 ఏళ్ల కిందట వేరే వ్యక్తితో వివాహమైంది. భర్త వేధింపులు భరించలేక అతడ్ని వదిలేసి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కళాశాలలో వంట పని చేసుకుంటూ బతుకుతోంది. అదే కళాశాలలో వంట పని చేసే రాజు పరిచయం కాగా, ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరు కన్నవారితోటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొద్ది కాలంగా రాజు, భార్యని అనుమానించడం ప్రారంభించాడు. నిత్యం మద్యం తాగి అసభ్యపదజాలంతో వేధించడం ప్రారంభించాడు. రెండు నెలలుగా పనికి వెళ్లకుండా భార్యని కూడా ఇంట్లోనే ఉండాలంటూ వేధిస్తున్నాడు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు సమాచారం అందించడంతో నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూసే సరికి ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. అప్పటికే లక్ష్మి మృతి చెందింది. రాజు కొనఊపిరితో ఉన్నాడు. పోలీసులు అతడ్ని జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, నగరంపాలెం ఎస్ఐ రమాదేవి సిబ్బందితో ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. లక్ష్మిని భర్త మెడ వంచి వెనుక భాగం నుంచి కత్తితో కోసి ఉన్నట్లు గుర్తించారు. అదే కత్తితో రాజు గొంతు కోసుకున్నట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. లక్ష్మి మృతదేహాన్ని జీజీహెచ్కి తరలించారు. కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాంగణ ఎంపికల్లో 64 మందికి ఉద్యోగాలు
నిజాంపట్నం: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్కు ద్వితీయ సంవత్సరం చదువుతున్న 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 64 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిక్రూట్మెంట్ మేళాలో ఎంఎస్ మహేంద్ర ఆటో పయనీర్ వరల్డ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్, నిర్మల ఇండస్ట్రీస్, పవర్ సర్వీసెస్, బెంగళూరు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్లతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. ఎంపికై న వారికి అప్రంటీస్ శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కాలంలో భృతి అందించనున్నట్లు ఆమె వివరించారు.
మార్టూరులో గడ్డి వామి దగ్ధం
మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. స్థానిక తూర్పు బజారుకు చెందిన పుట్టా విలాస్ బాబు గొడ్ల చావిడిలో ఉన్న వరి గడ్డి వామిపై బాణసంచా పడటంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో చిలకలూరిపేట నుంచి వచ్చిన అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను ఆర్పారు.