
యువతకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్ జీవితం
తెనాలి: సైన్యంలో దేశ రక్షణ విధుల్లో కొనసాగి, బయటకొచ్చాక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీడారంగ అభివృద్ధికి తోడ్పడుతూ సమాజసేవలో కొనసాగుతున్న చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ జీవితం నేటియువతకు స్ఫూర్తిదాయకమని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి.కె.రావు అన్నారు. రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న సీబీఆర్ అకాడమీ రజతోత్సవాల సందర్భంగా తపాలా శాఖ తీసుకొచ్చిన ప్రత్యేక కవరును శనివారం సాయంత్రం తెనాలిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్రాజా అధ్యక్షత వహించారు. రాజేంద్రప్రసాద్ నినాదం ‘విన్ ఫర్ ఇండియా...డై ఫర్ కంట్రీ’ తనను ఎంతగానో ఆకర్షించిందని బీకే రావు చెప్పారు. రాజేంద్రప్రసాద్ సేవల్ని గుర్తించి తపాలశాఖ ప్రత్యేక కవరును విడుదల చేయడంఅభినందనీయమని తెలిపారు. తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు మాట్లాడుతూ దేశభక్తుడి గురించి ప్రత్యేక కవరును విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు. సైనిక్ వెల్ఫేర్ బోర్డు బ్రిగేడియర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ సంపాదించిన డబ్బును సమాజసేవకు వినియోగిస్తున్న మాజీ సైనికుడు సీబీఆర్ ప్రసాద్ను భారత ప్రభుత్వం గుర్తించాలని అభిప్రాయపడ్డారు. సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు బిడ్డలకు సంపదను ఇవ్వొద్దని, కష్టపడి ఎదిగేలా వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. 18 ఏళ్ల వరకే తల్లిదండ్రుల పెంపకం ఉండాలని, ఆ తర్వాత సైన్యంలోకి పంపాలని సలహానిచ్చారు. సభలో ఆంధ్రప్రదేశ్ పూర్వ సైనిక్ సేవాపరిషత్ అధ్యక్షుడు కల్నల్ రాంబాబు, ఆచార్య డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి, మాజీ సైనికుల సంఘం రాష్ట్ర నేతలు మోటూరి శంకరరావు, అయినంపూడి రత్నప్రసాద్ తదితరులు మాట్లాడారు.