
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
పట్నంబజారు: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరగుంట సమీపంలోని స్కైలోన్ అపార్ట్మెంట్లో నివసించే నరహరి శైలజ (54) భర్త శ్రీనివాసరావుకు మార్కెట్లో కిరాణా దుకాణం ఉంది. ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం జిన్నాటవర్ సెంటర్లోని ఒక దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసేందుకు శైలజ వచ్చారు. అక్కడ కొనుగోలు చేసి కిందకు దిగారు. అప్పుడే గుంటూరు– 1 డిపో నుంచి క్రోసూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆపబోయాడు. ఈ క్రమంలో శైలజ బస్సు ముందు నుంచి నడిచి వెళ్తుండగా, గమనించని డ్రైవర్ ముందుకు నడిపాడు. బస్సు టైర్ కింద పడి శైలజ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. శైలజ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.