
అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పు !
నెహ్రూనగర్: నగరపాలక సంస్థ అధికారులు తప్పులెన్ని చేసినా తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. ఉన్నతాధికారులను మ్యానేజ్ చేసుకోవడంలో సిద్ధహస్తులనే చెప్పుకోవాలి. దీనికి 2013–14లో జరిగిన ఆస్తి పన్ను తగ్గింపు వ్యవహారం అద్దం పడుతోంది. భారీగా అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై అప్పటి ఆర్డీఎంఏ చల్లా అనురాధ విచారణ చేపట్టారు. ఆమె వాస్తమేనని తేల్చి రిపోర్టు ఇచ్చారు. దాని ఆధారంగా బాధ్యులైన అధికారులపై అర్టికల్ చార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు వారంతా తప్పేమి చేయలేదంటూ వాటిని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నగరపాలక సంస్థ ఖజానాకు భారీ నష్టం
2013–14లో ఆస్తి పన్నులను (రివిజన్ పిటిషన్) భారీగా తగ్గించారు. దీని వల్ల నగరపాలక సంస్థ ఖజానాకు కోట్ల రూపాయిల్లో నష్టం వాటిల్లింది. దీనిపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందడంతో అప్పటి మున్సిపల్ ఆర్డీగా ఉన్న చల్లా అనురాధ పన్నులు తగ్గింపు విషయం వాస్తవమేనని తేల్చారు. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నివేదిక ఇచ్చారు. దీనిపై టీడీపీ ప్రభుత్వం 2018లో అవినీతి అధికారులపై చార్జ్స్ ఫ్రేమ్ చేసి వదిలేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భావించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మూడు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీప్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి 2021 జూలై 8న ఆదేశాలు జారీ చేశారు. 2021 సెప్టెంబర్లో మున్సిపల్ ఆర్డీ అక్రమాలకు పాల్పడిన అధికారులకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ ఫైల్ను ప్రభుత్వానికి పంపించడంలో అప్పటి ఆర్డీ శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బంది మీనమేషాలు లెక్కించడంతో పెండింగ్లో పడిపోయింది. తాజాగా ఈ నెల 16న సదరు అధికారులు ఎటువంటి తప్పు చేయలేదని, వారిపై ఆర్టికల్ చార్జెస్ను తీసివేస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వ కనికరం
ఆర్టికల్ చార్జెస్ ఉంటే రిటైర్మెంట్ అయిన తరువాత బెనిఫిట్స్ అందవు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ స్టేజ్కు దగ్గరలో ఉన్నారు. చార్జెస్ ఫ్రేమ్ చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాబట్టి వీరంతా పావులు కదిపారు. తమ పలకుబడి ఉపయోగించి ఆర్టికల్ చార్జెస్ తీయించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవకతకవలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని తప్పిస్తే మిగతా ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఏ విధంగా లెక్క చేస్తారంటూ కొంతమంది ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
2013–14 లో ఆస్తి పన్ను తగ్గింపులో అవకతవకలకు పాల్పడిన అధికారులు
ప్రజల నుంచి ఫిర్యాదుల వెల్లువ
2018లో 12 మంది అధికారులపై
ఆర్టికల్ చార్జెస్ను ఫ్రేమ్ చేస్తూ ఉత్తర్వులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వారిపై చర్యలు తీసుకోవాలని
2021లో ఆర్డీఎంఏను ఆదేశించిన
ప్రిన్సిపల్ సెక్రటరీ
విచారణ ఫైల్ను ప్రభుత్వానికి పంపని అప్పటి ఆర్డీఎంఏ అధికారులు
తాజాగా ఉద్యోగులపై ఆర్టికల్ చార్జెస్ను తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
అప్పటి అధికారుల జాబితాలో ప్రస్తుత కమిషనర్
రివిజన్ పిటిషన్లో అక్రమాలకు పాల్పడిన జాబితాలో ప్రస్తుత నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన అదనపు కమిషనర్తో పాటు ఇనన్చార్జ్ కమిషనర్గా పని చేశారు. ఆయనతో పాటు వి.సత్యప్రసాద్ ఆర్వో(రిటైర్డ్), ఎల్. పద్మ (ఆర్ఐ), ఎస్. నారాయణరావు(ఆర్ఐ రిటైర్డ్), ఎస్.వి.వి.ఎస్. మదన్న్గోపాల్(ఆర్ఐ), డి. మాధవి, ఎ.న్పెద కోటయ్య, పి. వెంకట్రావు (డీలింగ్ అసిస్టెంట్), డి. నాగరాజు(బిల్ కలెక్టర్), ఎస్కే నసీర్ అహ్మద్(బిల్ కలెక్టర్), ఎండీ ఉస్మాన్అలీ(బిల్ కలెక్టర్), జె. శ్యాంప్రసాద్ (బిల్ కలెక్టర్) ఉన్నారు.