
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: సుపరిపాలన– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23న వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం సీఆర్డీఏ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ తేజ, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ నవీన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ, డీటీ వసంతరావు పాల్గొన్నారు.
మహిళలపై పెరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు
లక్ష్మీపురం: రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు పెరిగాయని, వయస్సుతో సంబంధం లేకుండా హత్యలు జరుగుతున్నాయని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలోని మల్లయ్య లింగం భవన్లో రాజవరపు కోటేశ్వరమ్మ అధ్యక్షతన గురువారం మహిళా సమాఖ్య మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెంటాల కుమారి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు రూపొందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. గొట్టిముక్కల దుర్గ నగర అధ్యక్షురాలిగా, గుండెబోయిన లక్ష్మి ప్రధాన కార్యదర్శిగా, 11 మంది కార్యవర్గం, 21 సమితి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు.
పామాయిల్ దిగుమతిపై
సుంకాన్ని పెంచాలి
లక్ష్మీపురం: పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యాన శాఖ కమిషనర్ టి.శ్రీనివాస్ను రైతు సంఘ ప్రతినిధులు గురువారం కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగ్గించిన దిగుమతి సుంకాన్ని 40శాతం వరకు పెంచి దేశీయ ఆయిల్ ఫామ్ రైతులను ఆడుకోవాలని ఆయన కోరారు. కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలున్న అంతర పంటల సబ్సిడీ, ఫెర్టిలైజర్, ప్లాంట్ సబ్సిడీని తక్షణమే రైతులకు అందించాలని విన్నవించారు. పామాయిల్ రైతుల సంఘం కార్యదర్శి పుల్లూరి సోమశేఖరాచార్యులు, ఏలూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రాయంకుల లక్ష్మణరావు, రైతు సంఘం నాయకులు చంగల వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి పి.వి. జగన్నాథం, పామాయిల్ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకూ ‘తల్లికి వందనం’ ఇవ్వాలి
లక్ష్మీపురం: తల్లికి వందనం పథకాన్ని ఆప్కాస్లో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ వర్తింపజేయాలని సీపీఐ నగర కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. గుంటూరు వసంతరాయపురం మలేరియా డివిజన్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు మున్సిపల్ కార్మికులందరినీ లబ్ధిదారులుగా చేసి ఆదుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డివిజన్లలో డంపర్ బాక్సులు పెంచి కార్మికులకు పని భారం తగ్గించాలని కోరారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన