
రాజధానిలో మొక్కలకు డ్రోన్లతో వర్మీవాష్
తాడికొండ: రాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు, మొక్కలకు పోషకాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు తెలిపారు. ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డుపై 10 కిలోమీటర్ల మేర పూల మొక్కలకు డ్రోన్ల ద్వారా వర్మీవాష్ చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఆర్గానిక్ పోషకాలను మొక్కలకు అందించడానికి ఈ పద్ధతి తోడ్పడుతుందని చెప్పారు. ప్రధానంగా ఈ పద్ధతిలో డ్రోన్ల ద్వారా జరిగే ప్రక్రియలో మొక్క పైనుంచి కింది భాగం వరకు పోషకాలు అందించవచ్చని తెలిపారు. దీని ద్వారా పూలు అందంగా పూయడంతో పాటు రహదారులు ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పారు.
22న అండర్–16
బాలుర క్రికెట్ జట్టు ఎంపిక
గుంటూరు వెస్ట్ ( క్రీడలు ) : జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఉదయం 8 గంటలకు స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అండర్–16 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు వి.మనోజ్ సాయి, యు.మహతీ శంకర్, బి.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1–2009 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. సెలక్షన్స్కి వచ్చేటప్పుడు వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్, వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు.