బొగ్గు బావుల ప్రైవేటీకరణ సిగ్గుచేటు | Singareni Workers Strike: Coal Mines Privatisation Sathupalli, Koyagudem, Sravanapalli | Sakshi
Sakshi News home page

బొగ్గు బావుల ప్రైవేటీకరణ సిగ్గుచేటు

Dec 9 2021 2:18 PM | Updated on Dec 9 2021 2:18 PM

Singareni Workers Strike: Coal Mines Privatisation Sathupalli, Koyagudem, Sravanapalli - Sakshi

సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3, శ్రావణపల్లి గని, కేకే–6 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెండర్లు పూర్తి చేసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిని ప్రైవేట్‌పరం చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సింగరేణిలో ఉన్న బొగ్గు బావులను ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకొన్నది. ప్రైవేటీకరణ ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా సింగరేణిని నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల జీవితాల మీద దెబ్బకొడుతుంది. ప్రస్తుతం నాలుగు బావులతో మొదలుపెట్టి ఆ తర్వాత సింగరేణి బావుల మొత్తాన్ని ప్రైవేట్‌పరం చేయడానికే కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. 

సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3, శ్రావణపల్లి గని, కేకే–6 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెండర్లు పూర్తి చేసింది. సింగరేణి బ్లాకులన్నీ ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేస్తారు. అప్పడు సింగరేణిలో కొత్త గనులు రావు. ప్రస్తుత కారుణ్య నియామకాల ద్వారా చేపడుతున్న వారసత్వ ఉద్యోగాలు ఉండవు. క్రమంగా సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పుడు అమలు చేస్తున్న హక్కులు, బోనస్‌లు, అలవెన్స్‌లను తగ్గిస్తుంది. దీనితో కార్మికుల మీద భారం పడుతుంది. వారు ఆర్థికంగా దెబ్బతిని కుంగిపోతారు. వారి కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి బొగ్గు బావులు ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి. (చదవండి: ‘జై భీమ్‌’ సినిమాలో చూపింది సత్యమేనా?)

ముందు సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల హక్కులపై దృష్టి పెట్టండి. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి. సింగరేణిలో పని చేస్తున్న అన్ని కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయండి. కరోనా వల్ల మరణించిన సింగరేణి కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించండి. సింగరేణిలో ఉన్న ఓపెన్‌కాస్ట్‌లో మట్టి తొలగింపు విధానం, అండర్‌గ్రౌండ్‌ గనుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిని నిలిపివేయండి. గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు వెంటనే సహాయం అందించండి. సింగరేణి కార్మికుల హక్కులను హరించి వేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న బొగ్గు బావుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగారు కావున సింగరేణిలో జరిగే 72 గంటల సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మికులు కర్షకులు, మేధావులు, ప్రజలపై  ఉంది. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం)

– కనికరపు లక్ష్మీకాంతం, కార్మిక సంఘాల జేఏసీ 

Advertisement
 
Advertisement
Advertisement