ఉత్పాదకత పెరగదు... అనారోగ్యం తప్ప! | Sakshi Guest Column On Industries and working hours | Sakshi
Sakshi News home page

ఉత్పాదకత పెరగదు... అనారోగ్యం తప్ప!

Jun 11 2025 6:10 AM | Updated on Jun 11 2025 6:10 AM

Sakshi Guest Column On Industries and working hours

కార్పొరేట్ల కోణంలో చూసినప్పుడు మనిషి కూడా ఒక యంత్రమే. ఈ యంత్రాన్ని తమకు నచ్చినంత సమయం వాడుకోవాలని యజమానులు చూస్తారు. ఎటువంటి భావోద్వేగాలనూ ప్రదర్శించకుండా తమ ‘చెప్పుచేతల్లో’ ఉంచుకోవా లని  ప్రయత్నిస్తారు. తాము ఇస్తున్న వేతనంతో పోలిస్తే ఉద్యోగి అందించే సేవ తక్కువ అన్న భావం ప్రకటించని యజమానులు అసలు ఉండ రేమో? మరోవైపు ఉద్యోగి తాను చేసే పనినీ, వచ్చే డబ్బునూ నిత్యం బేరీజు వేసుకుంటాడు. 

ఈ లెక్కల మధ్య ఉద్యోగి–యజమాని సంబంధాల్లో పనిగంటలు అనేవి కీలకం. అసలు ఎన్ని గంటలు పనిచేస్తే యజమానులు సంతృప్తి చెందుతారనేది సమాధానం లేని ప్రశ్న. ఏడాది న్నర క్రితం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయ ణమూర్తి వారానికి 70 గంటలు ఉద్యోగులు పని చేయాలని ప్రతిపాదించి పెద్ద చర్చను లేవదీశారు. ఈ రకమైన ‘వర్క్‌ ఎథిక్‌’ దేశ ప్రగతికి చాలా అవసరమనీ, అప్పుడే వేగంగా అభివృద్ధి చెందు తున్న చైనా, జపాన్‌లతో పోటీ పడగలమనీ తన వాదనను సమర్థించుకున్నారు. 

ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ సుబ్రహ్మణ్యం ఓ అడుగు ముందుకేసి వారానికి 70 గంటలు కాదు, 90 గంటలు పని చేస్తే ఇంకా మంచిదని సూచించారు. ‘మీ ఆవిడ మొహం చూస్తూ ఎంత సేపు ఇంట్లో కూర్చుంటారు. ఆదివారం కూడా పనిచేసుకోండి’ అని ఉచిత సలహా ఒకటి పారేశారు. ఎన్వీడియా వంటి సంస్థల్లో షేర్లు ఉన్న ఉద్యోగులు ఇప్పటికే వారానికి 90 గంటలు పని చేస్తున్నారు. ఒకవైపు ఎక్కువ పనిగంటల పైన చర్చ జరుగుతుంటే... శాప్‌ ల్యాబ్స్, వీబా ఫుడ్స్‌ వంటి సంస్థలు పనిగంటలు తగ్గించాయి. దీని వల్ల ఉత్పాదకత పెంచుకోగలి గామని చెబుతున్నారు.  

ఇప్పుడు ఇదంతా మాట్లాడుకోవటం ఎందు కంటే...  ఏపీ ప్రభుత్వం రోజువారీ  పని గంట లను 9 నుంచి 10 గంటలకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రయి వేటు సంస్థలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, తప్పనిస రిగా ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు లేబర్‌ కోడ్‌ను సవరించాలని నిర్ణయించింది. రోజుకి 8 గంటల వంతున 5 రోజుల పాటు అంటే మొత్తం 40 గంటలపాటు పని చేయటం అనేది  ప్రామాణికంగా ఉంది. 

ఈ ఎనిమిది గంటలను దశాబ్దం క్రితం 9 గంటలు చేశారు. ప్రస్తుతం పెట్టుబడులను  ఆకర్షించటానికి, మరిన్ని పరిశ్రమ లను రప్పించటానికి పని గంటలు పెంచినట్టు ప్రభుత్వం చెబుతోంది. ట్రేడ్‌ యూనియన్లు ఈ విషయంపైన ఆందోళన చెందుతున్నాయి. ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులు ఇప్పటికే  దాదాపు రెండు గంటల సమయం అధికంగా పనిచేస్తున్నా రనీ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల పని భారం 12 గంటలకు పెరుగుతుందనీ చెబు తున్నారు. 

ప్రభుత్వం ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో భాగంగా... ‘ఏపీ ఫ్యాక్టరీస్, బాయిలర్స్‌ చట్టం’, ‘ఇన్సూరెన్స్‌, మెడికల్‌ సర్వీసెస్‌ చట్టం’, ‘ఏపీ షాప్‌ అండ్‌ ఎస్టాబ్లిష్మెంటు చట్టా’ల్లో మార్పులు చేస్తోంది. ఓటీ నిబంధనలు, నైట్‌ షిఫ్ట్‌ నిబంధనలు మార్చారు. ఇకపై మహిళలను కూడా నైట్‌ షిఫ్టుల్లో పనిచేయటానికి అనుమతిస్తారు.   

పనిగంటలు ఎక్కువయితే ఉత్పాదకత పెరు గుతుందా? అలాంటిది ఏమీలేకపోగా, ఓ స్థాయి దాటి పని చేయటం వల్ల ఉత్పత్తి దారుణంగా పడిపోతుందని కూడా వెల్లడయ్యింది. ఉద్యోగుల్లో  ఒత్తిడి, బర్నవుట్‌తో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబు తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ దారుణంగా దెబ్బతింటుంది. భారత దేశంలో 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం కూడా ఉద్యోగి వారానికి 48 గంటలకు మించి పని చేయకూడదని చెబుతోంది. 

ఆఫీసులో ఎక్కువ సమయం ఉండటం వల్ల ఎక్కువ ఉత్పాదకత సాధించగలమని అనుకోవటం భ్రమ. పని ప్రదే శాల్లో సీసీ కెమెరాలు, సామాజిక మాధ్యమాలపైన నిషేధం ఉంచటం, మొబైళ్లను సైతం అనుమతించకపోవటం వల్ల వచ్చే ఫలితం అల్పం. ‘మిమ్మల్ని మేం నమ్మటం లేదు’ అని యాజమాన్యం పరోక్షంగా ఉద్యోగికి చెప్పటమే ఇది. ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయకపోవటానికీ, గౌరవంగా ఉండకపోవటానికీ అది కారణం అవుతుంది. ప్రతి ఉద్యోగీ కంపెనీ ఉత్పాదకతలో భాగస్వామి అన్న భావం ఎక్కువ మంచి ఫలితాన్ని అందిస్తుంది.  

ఇప్పుడు ఏఐ రంగ ప్రవేశంతో పని విధానం మారిపోయింది. ఉద్యోగుల పాత్ర క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొన్ని ఉద్యోగాలు మాయ మవుతూ మరికొన్ని కొత్తవి రంగప్రవేశం చేస్తు న్నాయి. ఓ సంధియుగంలో ఉద్యోగులు భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగి–యజమాన్య సంబంధాలు సవ్యంగా, సానుకూలంగా మారటం పోయి వారి మధ్య అగాథం మరింత తీవ్రమవుతోంది. 

– డా‘‘ పార్థసారథి చిరువోలు
సీనియర్‌ జర్నలిస్ట్‌ ‘ 99088 92065 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement