హవ్వ... మోసగాడికి వత్తాసా?

Chandrababu Supports MLC Ashok babu Over Fake Qualification Issue - Sakshi

తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఉదంతంలో చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. అశోక్‌బాబు అరెస్ట్‌ అయిన తర్వాత న్యాయస్థానం  బెయిల్‌ మంజూరు చేస్తే దాన్ని కోర్టు ఇచ్చిన క్లీన్‌ చిట్‌గా చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి అతడికి మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 

ఏపీ సబార్డినేట్‌ రూల్‌ 23(6) ప్రకారం ప్రభుత్వ శాఖాధి పతులు, డైరెక్టర్ల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాలంటే సదరు ఉద్యోగి తప్పనిసరిగా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. కాగా ఈ నిబంధనలకు విరుద్ధంగా అశోక్‌ బాబు వ్యవహరించారు. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన 1996 నాటికి పదోన్నతి పొంది విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్నారు. అదే సంవత్సరం శాఖాధిపతుల కార్యాలయంలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను బీకామ్‌ చదివి నట్టూ, అలాగే ఎన్‌ఐఐటీ అనే ప్రైవేటు సంస్థ నుంచి డిప్లమో ఇన్‌ కంప్యూటర్‌ (డీకామ్‌) కూడా పొందినట్టూ అఫిడవిట్‌ ఇస్తూ దరఖాస్తులో పేర్కొన్నారు. అంతేకాదు తన సర్వీస్‌ రిజిస్టర్‌లో విద్యార్హతగా ఉన్న డీకామ్‌ను బీకామ్‌గా ట్యాంపర్‌ చేసి ప్రభుత్వాన్ని మోసగించారు. 

అశోక్‌బాబు మోసంపై వాణిజ్య పన్నుల శాఖలో ఓ ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో శాఖాధిపతి కార్యాలయం కోసం దరఖాస్తు చేసిన ఆరుగురు ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్‌లను తన వద్దకు తీసుకురావాలని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ ఆదేశించారు. వారిలో ఐదుగురి సర్వీస్‌ రిజిస్టర్లు వచ్చాయి. కానీ అశోక్‌బాబు సర్వీస్‌ రిజిస్టర్‌ రాలేదు. తరువాత చూస్తే ఆయన సర్వీస్‌ రిజిస్టర్‌లో విద్యార్హత కాలమ్‌ వద్ద చిత్తు చిత్తుగా కొట్టివేసి ఉంది. అంటే ఆ కాలమ్‌లో ఏం రాసి ఉందన్నది ఎవరికీ తెలియకూడదనే అలా చేశారు. ప్రభుత్వ శాఖలో సంబంధిత అధికారి నియంత్రణలో ఉండాల్సిన సర్వీస్‌ రిజిస్ట ర్‌ను అనుమతి లేకుండా తీసుకుని అలా కొట్టివేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. 

అశోక్‌బాబు తప్పుడు విద్యార్హతలను పేర్కొంటూ ప్రభు త్వాన్ని మోసగించారనే ఫిర్యాదుపై 2013లోనే వాణిజ్య పన్నుల శాఖ విచారణకు ఆదేశించింది. కాగా 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అశోక్‌బాబుపై దర్యాప్తును 2018వరకు సాగ దీసిన టీడీపీ ప్రభుత్వం అతడికి క్లీన్‌ చిట్‌ ఇచ్చేసింది. ఇక టీడీపీకి రాజకీయ లబ్ధి కలిగించేలా 2014లో ప్రభుత్వ ఉద్యోగులను మోసగించిన అశోక్‌ బాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చంద్రబాబు 2018 చివర్లో నిర్ణయించారు. దాంతో ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) కోసం దరఖాస్తు చేశారు. సర్వీసు నిబంధన 42 ప్రకారం 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి వీఆర్‌ఎస్‌ కోసం కనీసం మూడు నెలల నోటీసు ఇవ్వాలి. ఆ ప్రకారం అశోక్‌బాబుకు 2019, జనవరి 31న వీఆర్‌ఎస్‌ ఇవ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా 2019, జనవరి 10నే ఆయనకు వీఆర్‌ఎస్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇక ఎవరైనా ఉద్యోగిపై ఏదైనా కేసు పెండింగులో ఉంటే  వీఆర్‌ఎస్‌కు అనుమతించకూడదన్నది ప్రభుత్వ నిబంధన. ఈ విషయంలోనూ అశోక్‌బాబుకు అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. తనపై ఎలాంటి కేసులు పెండిం గులో లేవని ఆయన తన వీఆర్‌ఎస్‌ దరఖాస్తులో పేర్కొన్నారు. దాన్ని సరిచూసుకోకుండానే ఉన్నతాధికారులు వీఆర్‌ఎస్‌కు అను మతించడం వెనుక టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. కానీ ఎమ్మెల్సీ నామినేషన్‌ çసందర్భంలో సమర్పించిన అఫిడివిట్‌లో అశోక్‌బాబు తనపై నాలుగు కేసులు పెండింగులో ఉన్నాయని వెల్లడించారు. అంటే ఆయన వీఆర్‌ఎస్‌ దరఖాస్తులో ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు సమాచారమిచ్చారన్నది స్పష్టమైంది. 

చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా అశోక్‌బాబు అక్రమా లకు వత్తాసు పలకడంతో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగిలింది. దాంతో ఆయన అక్రమాలపై పూర్తి ఆధారాలతోసహా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అన్ని అంశా లను సమగ్రంగా పరిశీలించిన లోకాయుక్త అశోక్‌బాబుపై ఆరో పణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని భావించింది. అందుకే ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ఆదేశిం చింది. ఎట్టకేలకు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ అశోక్‌ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో సీఐడీ రంగం లోకి దిగి జనవరి 25న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

అంతవరకు అశోక్‌బాబు తాను బీకామ్‌ చదివినట్టు సర్వీస్‌ రిజిస్టర్‌లో ట్యాంపర్‌ చేశారనే అంతా భావించారు. కానీ సీఐడీ దర్యాప్తుతో ఆయన అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. ఆయన ఏకంగా ఓ ఫేక్‌ బీకామ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించినట్టు సీఐడీ దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు తాను బీకామ్‌ చేసినట్టు ఆయన అఫిడవిట్‌ కూడా సమర్పించారని తెలిసింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వాన్ని మోసగించారన్నది నిర్ధారణ అయ్యింది. తగిన ఆధారాలు లభించినందునే సీఐడీ ఆయన్ని ఫిబ్రవరి 10 రాత్రి అరెస్టు చేసింది. 

విజయవాడలోని న్యాయస్థానంలో అశోక్‌బాబును ప్రవేశ పెట్టినప్పుడు ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. న్యాయస్థానం స్పందిస్తూ ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇక్కడ న్యాయస్థానం అశోక్‌బాబుకు బెయిల్‌ మాత్రమే మంజూరు చేసింది. అంతేగానీ ఆయన ఏమీ నిర్దోషి అని తీర్పునివ్వలేదు. ఆయన అక్రమాలపై దర్యాప్తు, విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. 

అశోక్‌బాబు బెయిల్‌పై విడుదల కాగానే ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు చంద్రబాబు. ఇదెంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఉద్యోగుల హక్కుల కోసం డిమాండ్‌ చేసినందుకే అశోక్‌బాబుపై ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టింది’ అని ఆరోపణలతో అసలు విష యాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు చంద్రబాబు. వాస్తవానికి ఉద్యోగుల సమస్యపై ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అశోక్‌బాబుకు ఏ సంబంధమూ లేదు. ఆయన ప్రస్తుతం ఉద్యోగుల ప్రతినిధి కాదు. ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీ అంశంపై ఆందోళన చేశాయి. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సామ రస్యంగా పలు దఫాలు చర్చించి ఉభయపక్షాలకు సమ్మతంగా సానుకూల ఫలితాన్ని సాధించింది. 

14 ఏళ్లు సీఎంగా చేశాను... రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం అశోక్‌ బాబుకు వత్తాసు పలకడం ద్వారా  ఏకంగా ప్రభుత్వ అధికార వ్యవస్థనే నిర్వీర్యం చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు. హవ్వ... ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా? 
 – వడ్డాది శ్రీనివాస్, సాక్షి అమరావతి విలేఖరి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top