
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు.
రోజూ అందించే టిప్లో భాగంగా ఈ రోజు కాలా మటన్, రామ్పూరి తార్ కుర్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసినవి: మటన్ – ముప్పావు కేజీ, గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు, పసుపు – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, పెరుగు – కప్పు, ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు, నూనె – ఐదు టేబుల్ స్పూన్లు, ధనియాలు – టేబుల్ స్పూను, గసగసాలు – టేబుల్ స్పూను, యాలుక్కాయలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, లవంగాలు – ఐదు, మిరియాలు – ఐదు, సోంపు – టేబుల్ స్పూను, ఎండు మిర్చి – నాలుగు, ఎండుకొబ్బరి తురుము – అరకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, షాజీరా – టీస్పూను, వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు – టేబుల్ స్పూను, బంగాళ దుంపలు – రెండు, చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ: మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత మటన్ను కుకర్లో వేయాలి. దీనిలో కొద్దిగా ఉల్లి పాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. దీనిలో కొన్ని ఉల్లి పాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషం పాయించాలి. ∙తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాల పాటు మగ్గనిచ్చి దించేయాలి. అంతే ఘుమఘుమ లాడే టేస్టీ టేస్టీ కాలా మటన్ రెడీ.
రామ్పూరి తార్ కుర్మా
కావలసినవి: నెయ్యి – కప్పు, మటన్ - కేజీన్నర, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్ స్పూన్లు, కారం - రెండు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు – రెండు, పసుపు – అర టీస్పూను, గరం మసాలా పొడి – టేబుల్ స్పూను, వేయించిన ఉల్లిపాయ పేస్టు - పావు కప్పు, పెరుగు – ఆరు టేబుల్ స్పూన్లు, పాలు -కప్పు, ఫూల్ మఖనీ – నాలుగు టేబుల్ స్పూన్లు, కర్బూజా గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, మటన్ సూప్- అరలీటర్, జీడిపప్పు - పది. కుర్మా మసాలా: యాలుక్కాయలు -పది, నల్ల యాలుక్కాయలు - రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, జాపత్రి ΄ పొడి -పావు టీ స్పూన్, అనాసపువ్వు- రెండు, లవంగాలు- నాలుగు, షాజీరా - టీ స్పూను, ఎండుకొబ్బరి తురుము - టేబుల్ స్పూను, మిరియాలు -పది, కశ్మీరి ఎండుమిర్చి రెండు.
తయారీ: ∙మటన్ను శుభ్రంగా కడిగి టేబుల్ స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కనబెట్టాలి. ∙కర్బూజ గింజలు, పూల్ మఖనీలను అరకప్పు ΄పాలలో నానబెట్టి, పేస్టు చేయాలి. ∙కుర్మా మసాలా దినుసులన్నింటిని దోరగావేయించి పొడిచేసి పక్కనపెట్టుకోవాలి. ∙మందపాటి బాణలిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, కారం వేయాలి. అరనిమిషం వేగాక మటన్ ముక్కలు, పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను మీడియంకు తగ్గించి, కుర్మా మసాలా టీస్పూను పక్కన పెట్టి మిగతాది వేయాలి, ఉల్లి΄పాయ పేస్టు, పూల్ మఖనీ పేస్టు, పెరుగు కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మటన్ సూప్,పావు కప్పుపాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. చివరిగా కుర్మా మసాలా పొడి, జీడిపప్పు వేసి మగ్గనిచ్చి దించేయాలి.