
రస్క్ గులాబ్జామ్
కావలసినవి: రస్క్ పౌడర్– ఒక కప్పు
మైదాపిండి– ఒక టేబుల్ స్పూన్
కొబ్బరి పాలు– తగినన్ని
పంచదార– అర కప్పు (పాకానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి)
ఏలకుల పొడి– కొద్దిగా, నూనె– సరిపడా
తయారీ: ముందుగా ఒక పాత్రలో రస్క్ పౌడర్, మైదాపిండి వేసుకుని ఒకసారి బాగా కలపాలి. తర్వాత దానిలో కొద్దికొద్దిగా కొబ్బరి పాలు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్లో పంచదార పాకం పెట్టుకుని, అందులో ఏలకుల పొడి వేసుకుని, దోరగా వేగిన ఉండలను అందులో వేసుకోవాలి. రెండు గంటలు కదలకుండా ఉంచి, చల్లారాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
ముంబై క్యాబేజీ ఖీర్
కావలసినవి: క్యాబేజీ తురుము– ఒక కప్పు
చిక్కటి పాలు– 4 కప్పులు
పంచదార– అర కప్పు పైనే
సేమియా పుల్లలు– 5 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి వీటిని వేసుకోవచ్చు, అయితే ముందుగా నేతిలో వేయించాలి)
నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు పైనే
ఏలకుల పొడి – అర టీస్పూన్
డ్రై ఫ్రూట్స్ తురుము– కొద్దిగా (గార్నిష్ కోసం)
తయారీ: ముందుగా తురిమిన క్యాబేజీని కొద్దిగా నేతిలో వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈలోపు మరో స్టవ్ మీద, మందపాటి గిన్నెలో పాలు పోసి, సగం అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో వేయించిన క్యాబేజీ తురుము, పంచదార, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్యలో సేమియా పుల్లలు, నెయ్యి వేసి తిప్పుతూ సుమారు 7 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
మలేషియన్ కుయ్ కారా బెర్లౌక్
కావలసినవి: చికెన్ కీమా– అర కప్పు (కారం, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు అన్నీ కొద్దికొద్దిగా కలిపి, 8 గంటల పాటు ఫ్రిజ్లో పెట్టి, అనంతరం నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి)
మైదా పిండి– ఒక కప్పు, గుడ్లు– 4, పసుపు– ఒక టీ స్పూన్
కొబ్బరి పాలు– పావు కప్పు, నీళ్లు– సరిపడా
బేకింగ్ సోడా– ఒక టీ స్పూన్, ఉప్పు,నూనె– తగినంత
మసాలా, ఉప్పు, కారం కలిపి ఉడికించిన లేదా వేయించిన రొయ్యలు, కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – గార్నిష్కి
తయారీ: ముందుగా మైదాపిండిలో పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మరో గిన్నెలో కొబ్బరి పాలు, కొద్దిగా ఉప్పు, గుడ్లు, 2 టీ స్పూన్ల నూనె వేసుకుని బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ మైదా మిశ్రమాన్ని క్రీమీగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గంట పక్కన పెట్టుకుని, పొంగనాల ట్రేకు అడుగున నెయ్యి లేదా నూనె రాసి, మైదా మిశ్రమంతో గుంతలన్నీ సగం వరకూ నింపుకోవాలి.
ఇప్పుడు కొద్దికొద్దిగా కీమా మిశ్రమాన్ని అందులో వేసుకుని, పైన మళ్లీ మైదా మిశ్రమంతో ఫిల్ చేసుకుని, బేక్ చేసుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని, ఒక్కో మైదా–కీమా బైట్ మీద ఒక్కో రొయ్యను, కొన్ని కూరగాయ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
(చదవండి: ది బెస్ట్ ఐస్ క్రీమ్లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..! నటి దీపికా పదుకొణె)