రొయ్యల ఆమ్లెట్‌ ఎలా తయారు చేయాలో తెలుసా?

Prawn Omelette Recipe Making In Telugu - Sakshi

కావలసినవి:
రొయ్యలు – 15 నుంచి 20 (లైట్‌గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు దట్టించి కుకర్‌లో ఉడికించుకోవాలి), గ్రీన్‌ పీస్‌ లేదా గ్రీన్‌ సోయాబీన్స్‌ – 100 గ్రాములు (నానబెట్టి, ఉడికించినవి), గుడ్లు – 3 (పెద్ద సైజ్‌), కారం, మిరియాల పొడి – కొద్దికొద్దిగా, సోయాసాస్‌ – 1 టీ స్పూన్, నువ్వుల నూనె – సరిపడా, కొత్తిమీర తురుము, పుదీనా తురుము – గార్నిష్‌కి (అభిరుచిని బట్టి మరిన్ని), ఉల్లికాడలు – 2 (చిన్నగా కట్‌ చేసుకోవాలి), ఉప్పు – తగినంత

తయారీ: ముందుగా ఒక చిన్న బౌల్‌లో గుడ్లు, చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, అర టీ స్పూన్‌ సోయాసాస్‌ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసుకుని మీడియం మంటపైన, ఒక బాణలిలో 2 టేబుల్‌ స్పూన్ల నువ్వుల నూనె వేడి చేసుకుని, ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఉడికించి పక్కనపెట్టుకున్న సోయాబీన్స్‌ లేదా బఠాణీలు వేసుకుని గరిటెతో తిప్పాలి. వెంటనే రొయ్యలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు  ఫ్రై చేసుకుని, పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో అర టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకుని, ఆమ్లెట్‌ వేసుకుని.. దానిపైన రొయ్యల–బఠాణీ మిశ్రమాన్ని పరచుకోవాలి. ఆమ్లెట్‌ని జాగ్రత్తగా  ప్లేట్‌లోకి తీసుకుని.. గార్నిష్‌ కోసం కొద్దిగా నూనె, మిగిలిన సోయాసాస్‌ వేసుకుని కొత్తిమీర, పుదీనా తురుముని ఓ వేపు వేయించి తీసుకుంటే సరిపోతుంది.

కొర్ర లు–కీమా గారెలు
కావలసినవి:  
మటన్‌ కీమా – అర కప్పు (శుభ్రం చేసుకుని, ఉప్పు, కారం, మసాలా వేసుకుని ఉడికించుకోవాలి), కొర్రలు – 1 కప్పు (6 గంటలు నానబెట్టుకోవాలి), పెరుగు – 3 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి – 2 (ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్‌,  ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా నానబెట్టిన కొర్రలను మిక్సీలో వేసుకుని, అందులో పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, అల్లం ముక్క, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో మటన్‌ కీమా వేసుకుని బాగా కలుపుకోవాలి. నూనె కాగిన తర్వాత గారెలుగా వేసుకుని, వాటిని మజ్జిగ ఆవడ వేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ గారెలు.

ఆపిల్‌–ఎగ్‌ కేక్‌
కావలసినవి:  ఆపిల్‌ – 4 (మీడియం సైజ్‌వి తీసుకుని, తొక్క, గింజలు తొలగించి, చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), పంచదార – పావు కప్పు,  నిమ్మతొక్కల తురుము – కొద్దిగా,  నిమ్మరసం – 1 టీ స్పూన్‌, గుడ్లు – 2,  వెజిటబుల్‌ ఆయిల్‌ – 100 గ్రాములు,  మైదా పిండి – పావు కప్పు, బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూన్‌

తయారీ: ముందుగా మిక్సీలో ఆపిల్‌ ముక్కలు, పంచదార, నిమ్మతొక్కల తురుము, నిమ్మరసం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గుడ్లు, వెజిటబుల్‌ ఆయిల్‌ వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని.. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్‌ పౌడర్‌ వేసుకుని హ్యాండ్‌ బ్లెండర్‌ సాయంతో బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కేక్‌ మేకర్‌లో వేసుకుని.. ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు నచ్చిన విధంగా క్రీమ్స్, బిస్కెట్స్, ఆపిల్‌ ముక్కలతో గార్నిష్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top