
చేపల విక్రయానికి మార్కెట్లు సిద్ధం
రకాన్ని బట్టి డిమాండ్
నెన్నెల(మంచిర్యాల): మృగశిర అనగానే గుర్తుకు వచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభరోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. మృగశిర కార్తెతో వర్షాకాలం ప్రారంభమైందని అంటారు. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు ఎంతో మంచివి. వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువ ఉంటుందని అది చేపలు తినడం వల్ల దూరమవుతుందనేది పెద్దల మాట. దీంతోపాటు పెరిగిన సమతుల్యం, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు చేపలు తినడం మంచిదని చెబుతారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరం చల్లబడేందుకు పోషక విలువలు పొందేందుకు చేపలు తినాలనేది ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో మృగశిర రోజున చేపలకు మంచి గిరాకీ ఉంటుంది.
ఫిష్ మార్కెట్లు సిద్ధం
మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే ఆనవాయితీ ఉండటంతో ఉమ్మడి జిల్లాలోని చేపల మార్కెట్లు సిద్ధం చేశారు. గ్రామాల్లో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగుల్లో చేపలను పట్టి మార్కెట్లకు తరలించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. గ్రామీణప్రాంతాల్లో వాడవాడ తిరుగుతూ వ్యాపారులు చేపలు విక్రయిస్తారు.
చేపలకు డిమాండ్
మృగశిర రోజు రెట్టింపు ధరలైనా వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనుకాడరు. సాధారణ రోజుల కంటే చేపలకు ధరలు విపరీతంగా పెరుగుతాయి. అయినా మత్స్యప్రియులు కొనేందుకు వెనుకాడరు. బొమ్మ చేప ధర సాధారణ రోజుల్లో కిలో రూ.300 ఉండగా మిరుగు రోజు కిలో రూ.600 రెట్టింపు ధర పలుకుతోంది. రవు, బొచ్చె, బంగారు తీగ, మెరుగ, ఆలుగుచేప, జెల్లెలు, పాపర్లు, గ్యాస్ కట్ రకాల చేపలు ఉండగా వీటి ధర సాధారణ రోజుల్లో కిలో రూ.120 ఉండగా మృగశిర రోజు రూ.200 నుంచి రూ.240 వరకు విక్రయిస్తారు.
ఆరోగ్యదాయకం ఇంగువ బెల్లం
శారీరక ఆరోగ్యం కోసం ఈ కార్తెలో శాఖాహారులు ఇంగువ, బెల్లం తింటారు. ఈ రెంటిని కలిపి చిన్నచిన్న ముద్దలు చేసి పరిగడుపున తింటారు. ఇంగువకు చలువ చేసే శక్తి, బెల్లానికి జీర్ణం చేసే శక్తి ఉంటుంది. విపరీతమైన ఎండలతో తల్లడిల్లిన జనానికి ఒక్కసారి ఋతువు మారడంతో శరీరంలో తలెత్తే రుగ్మతలు దీన్ని తినడంతో నశిస్తాయని పెద్దలు చెబుతుంటారు.
ఉచిత చేపమందు పంపిణీ
దండేపల్లి: మండల కేంద్రంలో మృగశిర కార్తెప్రవేశాన్ని పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నివారణకు గ్రామానికి చెందిన రంగసాయి ప్రేమ్రాజ్–భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఉచిత చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మందు పంపిణీ కోసం నిర్వహణ కమిటీ శనివారం జీపీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. చేపమందు కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని చర్చించారు. వివరాలకు 9866885308, 9440707416, 9640376530, 9908401985 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.