భీమునిపట్నం: ప్రేమకథా చిత్రాలకు భీమిలి తీరానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇక్కడ రూపుదిద్దుకుని ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా 1978లో విడుదలైన దర్శక శిఖరం కె. బాలచందర్ దృశ్యకావ్యం ‘మరోచరిత్ర’ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన ఈ చిత్రంలోని మెజారిటీ సన్నివేశాలు భీమిలి తీరంలోనే చిత్రీకరించారు. అప్పట్లో అంటే సుమారు 1850 ప్రాంతంలో బ్రిటీష్ గవర్నర్ నివాసం కోసం సముద్ర తీరాన నిర్మించిన అరుదైన బంగ్లా ‘గాలిమేడ’ ఈ సినిమాతోనే ప్రజలకు చేరువైంది. డచ్ గవర్నర్ బంగ్లాగా పిలవబడే ఈ కట్టడం సినిమా హిట్ అయ్యాక ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. అయితే దురదృష్టవశాత్తూ 1990వ దశకంలో ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ చారిత్రక గాలిమేడను కూల్చివేసినప్పటికీ, నేటికీ పాతతరం ప్రేక్షకులు ఆ ఖాళీ స్థలాన్ని చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు.
బాలచందర్ మెచ్చిన తీరం
బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘కోకిలమ్మ’ సినిమాతో మొదలైన ఈ సినీ ప్రస్థానం ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేదికైంది. 1986లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా సత్యరాజ్, రేఖలతో తీసిన ‘కడలోర కవిదైగళ్’ చిత్రాన్ని భీమిలిలోని గ్రంథాలయం ఎదురుగా ఉన్న సరస్వతి సమాజం పరిసరాల్లోనే చిత్రీకరించారు. ఇదే సినిమాను 1987లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆరాధన’ పేరుతో రీమేక్ చేసినప్పుడు కూడా భీమిలినే ప్రధాన లొకేషన్గా ఎంచుకున్నారు. సుహాసిని టీచర్గా ఉన్న స్కూల్, ఆమె బడికి రావద్దని చెబితే చిరంజీవి ఒంటికాలిపై నిలబడే దిమ్మ, లైట్ హౌస్ కీపర్ క్వార్టర్స్లో ఉన్న చిరంజీవి ఇల్లు.. ఇవన్నీ ఇప్పటికీ అలాగే ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
ఎన్నో చిత్రాల నిర్మాణం
శుభలేఖ, ముద్దమందారం, మహర్షి వంటి క్లాసిక్ చిత్రాలే కాకుండా హిందీ, తమిళ సినిమాలు కూడా ఈ తీరంలో సందడి చేశాయి. 1992లో నటి రోజా, ఆమె భర్త సెల్వమణి కాంబినేషన్లో వచ్చిన ‘చామంతి’, నాగార్జున ‘రావోయి చందమామ’, ప్రభుదేవా ‘టైమ్’ వంటి సినిమాల చిత్రీకరణ బ్యాంక్ రోడ్డులోని ‘ఓషన్ వ్యూ’ బంగ్లా వద్ద జరిగింది. అయితే మారుతున్న కాలంతో పాటు ఆ బంగ్లా కూడా కూలి్చవేతకు గురైంది. గాలిమేడ, ఓషన్ వ్యూ బంగ్లా వంటి కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయినా, ‘ఆరాధన’ సినిమా స్కూల్, ఆనాటి దిమ్మ, నరసింహస్వామి ఆలయ పరిసరాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. భీమిలి అందాలు వెండితెరపై ఎంతటి మాయాజాలాన్ని సృష్టించాయో చెప్పడానికి ఈ లొకేషన్లే సజీవ సాక్ష్యాలు.
సందడిగా ఉండేది
ఇక్కడ షూటింగ్లు జరగడవల్ల ఎంతో సందడిగా ఉండేది, ముఖ్యంగా ఆరాధన షూటింగ్ రెండు నెలలకు పైనే జరిగింది. ఇందులో చిరంజీవి హీరోకావడంతో విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి ప్రతి రోజు భారీ ఎత్తున జనం వచ్చేవారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు, చిత్ర యూనిట్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది.
–రాంబోతు సత్యనారాయణ, భీమిలి
కాలేజ్కు వెళ్లేవాళ్లం కాదు
ఆరాధన షూటింగ్ ఇక్కడే ఎక్కువ రోజులు జరిగింది. చిరంజీవి, సుహాసిని, రాధికను చూడాలని ఎంతో ఆసక్తి ఉండేది. స్నేహి తులంతా కలిసి కాలేజ్కి డుమ్మా కొట్టి షూటింగ్ చూడడానికి వెళ్లేవాళ్లం.
–అయ్యగారి లలితారమేష్ భీమిలి
భీమిలికి మంచి గుర్తింపు
ఇక్కడ షూటింగ్లు తరచూ జరుగుతుండడంతో భీమిలి ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది. దీనికి చారిత్రిక, పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారు. సినిమా షూటింగ్ల వల్ల ఈ ప్రాంతం
మరింత గుర్తింపు లభించింది. ప్రభుత్వం చారిత్రక కట్టడాలకు మెరుగులు దిద్దాలి.
–కంటుభుక్త ముత్యాలరావు, భీమిలి


