ఎండా కాలంలో వడదెబ్బ (సన్స్ట్రోక్), డీ హైడ్రేషన్ వంటి వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. వీటికి సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ సీజన్లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకుందాం.
తీసుకోవలసిన జాగ్రత్తలు..
ఎండలు ఉండే సమయంలో ఎక్కువగా తిరగరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకోవాలి.
రోడ్లమీద అమ్మే రంగు రంగుల డ్రింక్స్ సేవించకూడదు. వీటిలో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.
జంక్ఫుడ్ తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవడం మంచిది
ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కనుక ఎప్పటికప్పుడు నీరు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.
రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగడం ఈ సీజన్లో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
తేలికైన కాటన్ దుస్తులు ధరించడం మంచిది.ఎండాకాలం రాత్రివేళల్లో చాలా మంది ఆరుబయట పడుకుంటుంటారు. ఇటువంటి సందర్భాల్లో దోమతెరల వంటివి ఉపయోగించాలి
ఎండలు అధికంగా ఉండే సమయంలో ఇంటి దగ్గరే ఉండాలి. మరీ అత్యవసరమైతే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లాలి.
వడదెబ్బతో జాగ్రత్త
ఎండ వేడిమికి ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వడదెబ్బ (సన్స్ట్రోక్). ఎండలో బయటికి వెళ్లడం వలన శరీరంలో నీరు తరిగిపోవడం వల్ల వెంటనే శరీరం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో మళ్లీ శరీరం మామూలు స్థితికి వచ్చే వరకు కొన్ని ప్రాథమిక విషయాలు పాటించాలి.
వడదెబ్బ తగిలినట్లయితే అటువంటి వ్యక్తిని వెంటనే నీడ గల ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో తడిపిన గుడ్డతో శరీరం తుడవాలని, శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే వరకు అలా చేస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి తగిలే చోట వారిని పడుకోబెట్టాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తాగించాలి
వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
వేసవిలో పానీయాలే రక్షిస్తాయి
వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. మరీ అవసరమైతే ఉదయం 7లోపు పనులు ముగించుకోవాలి. ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా మన ఇంట్లోనే దొరికే సహజమైన మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. పుచ్చకాయ, కీరదోసకాయ, తాటిముంజలు, సబ్జాగింజలు, రాగి అంబలి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. వేసవిలో మనం తీసుకునే పానీయాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు మంచినీరు తాగాలి.
– డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వర్రావు,
లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
త్వరగా నిద్ర పోవాలి
వేసవిలో సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యంగా పడుకోవడం వల్ల ఆలస్యంగా లేచి ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తుంది. త్వరగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి. ఈ సీజన్లో వాకింగ్, జాగింగ్కు వెళ్లే వారు ముందుగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొంచెం నీరు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తాగుతుండాలి. ఏమీ తాగకుండా నడవడం, పరిగెత్తడం వల్ల త్వరగా నీరసం వస్తుంది. ఎండలో ప్రయాణించేవారు, ఉద్యోగాల నిమిత్తం బయట పనులు చేసుకునే వారు తమతో పాటు మంచినీరు తీసుకువెళ్లడం మంచిది. గంటకు కనీసం ఒకసారి నీరు తాగడం వల్ల అలసట తగ్గుతుంది.
– డాక్టర్ శైలేష్ మోడి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,
కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, సీతమ్మధార
పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
వేసవిలో పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీరు త్వరగా రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలను ఎక్కువ సేపు ఎండలో తిరగనీయకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పిల్లలను బయట ఆటలకు అనుమతించాలి.
సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో ఇంట్లోనే ఉండి ఆడుకునే చెస్, క్యారమ్స్, లూడో వంటి ఇండోర్ గేమ్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వంటివి అలవాటు చేస్తే మంచిది. వీటి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత కూడా మెరుగవుతుంది. ఎక్కువగా మొబైల్, టీవీలకు అతుక్కుపోకుండా పిల్లలను వేరే సమ్మర్కోచింగ్ వంటి వాటిలో చేరి్పంచినా మంచిది.
– శంకర్ నీలు భాగవతుల, రచయిత, పరిశోధకుడు


