సిట్టింగ్ డిసీజ్
ఆధునిక యుగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తుల్లో కొంతమంది గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే 'సిట్టింగ్ డిసీజ్' అని పిలుస్తున్నారు. ఈ సిట్టింగ్ డిసీజ్ ఇతర రోగాలకన్న ప్రమాదకరమైనది. చాపకింద నీరులా.. అనారోగ్య సమస్యల్ని మరింత తీవ్రం చేస్తుంది.
ఆరోగ్య సమస్యలు..
ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నెముకపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నడుము, మెడ నొప్పులు వస్తాయి. అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు ఖర్చు కాక స్థూలకాయానికి దారి తీస్తుంది. రక్తప్రసరణ మందగించి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు స్క్రీన్లను నిరంతరం చూడటం వల్ల కళ్లు పొడిబారడం, తలనొప్పి అదనంగా వచ్చే అనారోగ్య సమస్యలు.
అయితే, ఎంత సేపు కూర్చుంటే, ఎంత ప్రమాదం ఉంటుందనే విషయంలో కొన్ని లెక్కలు చెబుతున్నారు నిపుణులు.
రోజుకి 4 గంటలోపు కూర్చుంటే.. ప్రమాద తీవ్రత కాస్త తక్కువే ఉంటుందట.
అదే 4 - 8 గంటలు కూర్చోవడంతో మధ్యస్థ ప్రమాదంగా చెప్పవచ్చు.
8- 11 గంటలు పాటు కూర్చోవడంతోనే మరింత ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుందంటున్నారు.
రోజుకి 11 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చోవడం అంటే ప్రమాదం అంచున ఉన్నట్టే. ఎంతలా అంటే.. హఠాత్తుగా గుండెపోటు రావడం, పక్షవాతం, శరీరం చలించకపోవటంవంటి సమస్యలు వస్తాయి.
ఈ ప్రమాదంనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కనీసం వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ చూడటం ఆపాలి. 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూడటం వల్ల కంటి రెటినా పొర చల్లబడుతుంది.
చిన్న విరామాలు: ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు సీటు నుండి లేచి నడవాలి. దాంతో శరీర కండరాల్లో కదలిక వల్ల రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది.
సరైన భంగిమ: వెన్నుముక నిటారుగా ఉండేలా కుర్చీలో కూర్చోవాలి. వెన్నుముక వంపుగా ఉంచి.. కుర్చీని ఆనుకుని ఉండటం వల్ల శరీరం మొద్దుబారి, మెదడు నిద్దురను కోరుకుంటుంది.
స్క్రీన్ ఎత్తు: కంప్యూటర్ మానిటర్ మన కంటి ఎత్తుకు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. దీంతో మెడ కండరాల్లో నొప్పి రాకుండా ఉంటుంది.
శారీరక వ్యాయామం: మెడ, చేతులు అలాగే నడుమును క్రమంగా స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి. కదలకుండా కూర్చోవడంతో శరీర కండరాలు తిమ్మిరెక్కి, రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది.
హైడ్రేషన్: పని మధ్యలో తగినంత నీరు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడవచ్చు.


