
అండమాన్ టూర్... అమేజింగ్ టూర్. (Amazing Andaman) ఎందుకంటే... ఇది రోడ్డు టూర్ కాదు. అలాగని రైలు బండి పర్యటనా కాదు.గాల్లో విమాన విహారమూ కాదు.నీటి మీద క్రూయిజ్లో విహారం. ఇంకా... నగరం మధ్య వీధుల్లో విహారం కాదు.ఇది... సముద్రం మధ్య దీవుల్లో విహారం.ఎటు చూసినా సముద్రమే...ఎటు వెళ్లినా ప్రకృతి ఆహ్లాదమే. ఒకవైపు ఇంద్రధనసు సూర్యోదయం.మరో వైపు ప్రకృతి చెక్కిన రాతి వంతెన.ఇన్ని ప్రకృతి అద్భుతాల సుమహారం ఈ టూర్.
17వ తేదీ తెల్లవారు జామున 4. 35 గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో టూర్ నిర్వహకులకు రిపోర్ట్ చేయాలి. మీట్ అండ్ గ్రీట్ తర్వాత పర్యాటకులందరూ విమానం ఎక్కాలి. విమానం దాదాపు తొమ్మిది గంటలకు పోర్ట్బ్లెయిర్కు చేరుతుంది. ఎయిర్΄ోర్ట్ నుంచి బయలుదేరి హోటల్కు చేరి చెక్ ఇన్ చేయాలి. లంచ్ తర్వాత అండమాన్లోని సెల్యూలార్ జైలు మ్యూజియం వీక్షణం, కోర్బిన్స్ కోవ్ బీచ్ విహారం. సాయంత్రానికి తిరిగి సెల్యూలార్ జైలుకు చేరుకుని లైట్ అండ్ సౌండ్ షో కి హాజరుకావడం.
శ్రీ విజయపురం!
పోర్ట్ బ్లెయిర్ పట్టణం ఇప్పుడు భారతీయతను సంతరించుకుంది. దీని కొత్త పేరు శ్రీ విజయపురం. అండమాన్ దీవులంటే ఇప్పుడు మనకు పర్యాటక ప్రదేశంగా మాత్రమే గుర్తు వస్తోంది. కానీ మనదేశానికి స్వాతంత్య్రాన్ని అధికారికంగా ప్రకటించకముందే మన జాతీయ పతాకం ఎగిరిన నేల ఇది. అందుకే శ్రీ విజయపురం అనే పేరును ఖరారు చేసింది భారత ప్రభుత్వం. ఇక్కడ వీర సావర్కర్ ఎయిర్పోర్ట్లో దిగిన క్షణం నుంచి జాతీయోద్యమకాలంలోకి వెళ్తున్న భావన మొదలవుతుంది. సెల్యులార్ జైలు ్ర΄ాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అసంకల్పితంగా గుండె బరువెక్కుతుంది. ఇది పోరాట యోధుల జీవించే హక్కునే కాలరాయడం కోసమే నిర్మించిన చెరసాల. బ్రిటిష్ దమన నీతికి నిదర్శనం. ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లున్న దీవుల్లో పెద్ద జైలు కట్టి జాతీయోద్యమకారులను బంధించేవారు. ఖైదీల చేత చేయించే పనుల నమూనా చిత్రాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. నాటి ΄ాలన దురాగతాలకు కళ్లకు కడుతుంది సాయంత్రం జరిగే సౌండ్ అండ్ లైట్ షో.

రెండో రోజు
పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్లాక్ (స్వరాజ్ ద్వీప్)కు ప్రయాణం. తెల్లవారు జామునే హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి ఇస్తారు. క్రూయిజ్ జర్నీ మొదలవుతుంది. హావ్లాక్ ఐలాండ్కి చేరిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ చేయాలి. మధ్యాహ్న భోజనం తర్వాత రాధానగర్ బీచ్ విహారం. తిరిగి హోటల్కు వచ్చిన తర్వాత డిన్నర్. రాత్రి బస హావ్లాక్ దీవిలో.
స్వరాజ్ ద్వీప్ విహారం
అండమాన్– నికోబార్ దీవుల్లో అనేక దీవులు, పట్టణాలు బ్రిటిష్ అధికారుల పేర్లతోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత మెల్లమెల్లగా కొత్త పేర్లతో వ్యవహారంలోకి వస్తున్నాయి. హావ్లాక్ కూడా బ్రిటిష్ అధికారి పేరే. అయితే దీనిని స్వరాజ్ ద్వీప్గా పేరు అధికారికంగా మారింది. ఇందుకు కారణం జాతీయోద్యమంలో భాగంగా అండమాన్ దీవుల్లో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయపతాకాన్ని ఆవిష్కరించి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినట్లు ప్రకటన చేశాడు. ఆయన గౌరవార్థం పాత పేర్లను హావ్లాక్ ఐలాండ్– స్వరాజ్ ద్వీప్, రాస్ ఐలాండ్– నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, నీయెల్ ఐలాండ్ – షాహీద్ ద్వీప్గా మార్చింది భారతప్రభుత్వం. ఈ దీవులు అచ్చమైన ప్రకృతి వరాలనే చెప్పాలి. చిరు అలల సవ్వడి వింటూ, మెత్తటి ఇసుకలో నడుస్తూ నీలిరంగు నీటికి– నీలాకాశానికి మధ్యనున్న గీత ఎక్కడో వెతుక్కుంటూ ఉంటే టైమ్ తెలియదు. ఇది ఎకో టూరిజమ్ జోన్. నియమాలను పాటించాలి. టైమ్ మ్యాగజైన్ 2004లో ఇక్కడి రాధానగర్ బీచ్కి టైమ్ ‘బెస్ట్ బీచ్ ఇన్ ఏషియా’ గుర్తింపు నిచ్చింది. ఈ టూర్లో ఎదురు చూసిన క్రూయిజ్ జర్నీని క్షణక్షణం ఆస్వాదించాలి.
మూడో రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత వాటర్ స్పోర్ట్స్ కోసం ఎలిఫెంట్ బీచ్కు వెళ్లాలి. వాటర్ స్పోర్ట్స్ టికెట్లు పర్యాటకులే కొనుక్కోవాలి. హోటల్ చేరేది రాత్రికే. హోటల్కు భోజనం, బస హావ్లాక్ ఐలాండ్లోనే.
పగడపు దీవుల విహారం!
ఎలిఫెంట్ బీచ్ సముద్రంలో స్విమ్మింగ్, సన్బాత్కి బాగుంటుంది. వాటర్ స్కూబా డైవింగ్ వంటి స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. మరకతాలు పరిచినట్లున్న సముద్రాన్ని ప్రశాంతం తీరాన కూర్చుని ఆస్వాదించడానికి వీలుగా రెల్లుగడ్డి గొడుగులతో పొడవాటి కుర్చీలుంటాయి. ఇక్కడ కూర్చుని సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతి. స్కూబా డైవింగ్లో సముద్రగర్భంలోకి దూరిపోయి అక్కడ విస్తరించిన పగడపు దీవులను చుట్టి రావచ్చు.
నాలుగో రోజు:
హావ్లాక్ నుంచి నీల్కు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తర్వాత కాలాపత్తర్ బీచ్ విహారం తర్వాత క్రూయిజ్లో నీల్ ఐలాండ్కు చేరాలి. హోటల్ గదిలో చెక్ ఇన్. సాయంత్రం సీతాపూర్ బీచ్, లక్ష్మణ్ పూర్ బీచ్లో సూర్యాస్తమయ వీక్షణం. రాత్రి బస నీయెల్ ఐలాండ్లో.
సన్రైజ్ బీచ్
షాహీద్ దీవి నుంచి సూర్యోదయ వీక్షణం ఓ మధురానుభూతి. చక్కటి వ్యూ పాయింట్ అని చెప్పవచ్చు. అందుకే దీనికి సన్రైజ్ బీచ్ అనే విశేషణం. ఫొటోగ్రఫీకి ది బెస్ట్ లొకేషన్. నవదంపతులు మంచి లొకేషన్లో ఫొటోలు తీసుకుంటే పర్యటన జ్ఞాపకాలు కూడా కలకాలం పదిలంగా ఉంటాయి.
ప్రకృతి అద్భుతం– శిలావంతెన
షాహీద్ (నీయెల్) దీవి ప్రకృతి చేసే చిత్రవిచిత్రాలకు, విన్యాసాల నిలయం. తిరుమల గిరుల్లో శిలాతోరణాన్ని చూస్తాం. కొండ రాళ్లు నీటి ప్రవాహ తాకిడికి అరిగి΄ోయి పై భాగంలో శిల అలాగే ఉండిపోవడంతో ఆ రూపం తోరణాన్ని తలపిస్తుంటుంది. ఈ దీవిలోని లక్ష్మణ్పూర్ బీచ్లో కూడా అలాంటి ప్రకృతి అద్భుతం ఉంది. దీనిని శిలా వంతెన, సహజ వంతెన అంటారు. ఈ బీచ్ సూర్యాస్తమయ వీక్షణానికి గొప్ప ప్రదేశం కావడంతో సన్సెట్ బీచ్ అంటారు. ఈ దీవిలో అరవై కిందటి వరకు ఇక్కడ మనుష సంచారం ఉండేది. ఇక్కడ ఉన్న స్థానికులు బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చిన హిందూ శరణార్థులే.
(రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో)
అయిదో రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి భరత్పూర్ బీచ్ విహారానికి వెళ్లాలి. ఆ తర్వాత ΄ోర్ట్బ్లెయిర్కు ప్రయాణం. ఈ రోజు సాయంత్రం విశ్రాంతిగా గడపడమే. రాత్రి బస పోర్ట్ బ్లెయిర్లో.
సప్తవర్ణమాలిక
సముద్రం మీద సూర్యోదయం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆరెంజ్కలర్లో బంతిలాగ నీటి నుంచి ఉద్భవిస్తున్న సూర్యుడి రూపమే. కానీ భరత్పూర్ బీచ్లో సూర్యోదయం సప్తవర్ణ సంగమం. సముద్రం ఈమద ఇంద్రధనసు విన్యాసాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సముద్రపు నీరు తక్కువ లోతులో ఈదడానికి అనువుగా జెట్టీ నిర్మాణం ఉంది. అందులో వాటర్ స్పోర్ట్స్, కోరల్ రీవ్స్ విజిట్తోపాటు ప్రశాంతంగా నీటిలో సేదదీరవచ్చు.హైదరాబాద్కు ప్రయాణం. పోర్ట్బ్లెయిర్లో తెల్లవారు జామునే హోటల్ గది చెక్ అవుట్ చేసి ఎయిర్పోర్టుకు చేరాలి. టూర్ నిర్వహకులు పర్యాటకులను ఎనిమిది లోపు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి, వీడ్కోలు చెబుతారు. విమానం 9.55కి బయలుదేరి 12.10 గంటలకు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.
ఇదీ చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ప్యాకేజ్ ఇలా:
కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ టికెట్ 74, 425 రూపాయలు.
డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 56,625 రూపాయలు. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 54, 925 రూపాయలు. పిల్లలకు (5–11 ఏళ్ల మధ్య) 48, 785
రూపాయలు. ఇందులో విడిగా బెడ్ ఉంటుంది. బెడ్ లేకుండా (2–11 ఏళ్ల మధ్య) 45, 485 రూపాయలు. రెండేళ్లలోపు పిల్లలకయితే టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ విమానం ఎక్కే ముందు ఎయిర్΄ోర్ట్ కౌంటర్లో దాదాపుగా 1,750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
బుకింగ్ ఎలా:
సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ, సౌత్సెంట్రల్ జోన్,
ఐఆర్సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ΄్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.
ఫోన్ నంబరు: 040– 27702407
విజయవాడ ఏరియా ఆఫీస్ : 92810 30714
టూర్ కోడ్: SHA18 - AMAZING ANDAMAN OCT 17
అమేజింగ్ అండమాన్ టూర్ అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. 6ఈ– 6305 నంబర్ విమానం 17వ తేదీ ఉదయం ఆరు గంటల 25 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఎనిమిది గంటల 55 నిమిషాలకు పోర్ట్బ్లెయిర్కు చేరుతుంది.
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి