డ్రెయినేజీలో వ్యక్తి మృతదేహం లభ్యం
తణుకు అర్బన్ : తణుకు బ్యాంకు కాలనీ డ్రెయినేజీలో శుక్రవారం ఉదయం వ్యక్తి మృతదేహం బయటపడ్డ ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పట్టణ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత బ్యాంక్ కాలనీ శివారు ప్రాంతమైన నాగేంద్రనగర్కు చెందిన గుడ్డాల నాగరాజు (40)గా గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్రంగి మేస్త్రిగా ఉన్న నాగరాజు మొదటి భార్య లక్ష్మి మృతి చెందడంతో రెండో భార్య సూర్యకళతో భీమవరంలో ఉంటున్నారు. తల్లి, పిల్లలను చూసేందుకు తరచూ నాగరాజు తణుకు వస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం తణుకు వచ్చిన నాగరాజు మద్యం తాగేందుకు ఇంటి నుంచి రైల్వేస్టేషనన్ రోడ్డుకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఉదయం నుంచి కుటుంబ సభ్యులు గాలించారు. డ్రెయినేజీలో మృతదేహం ఉందన్న వార్త విని కుటుంబసభ్యులు వచ్చి చూసి నాగరాజుగా నిర్ధారించారు. పట్టణ ఇన్చార్జ్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఎస్సైలు శ్రీనివాస్, జానా సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. నాగరాజు తరచూ మద్యం సేవించి ఇంటికి వస్తుంటారని, మద్యం మత్తులోనే డ్రెయినేజీలో పడి ఊపిరి ఆడక మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు కుమారుడు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


