తమ సమస్యల కోసం కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
కలెక్టరేట్ వద్ద రేషన్ డీలర్ల నిరసన ప్రదర్శన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పథకాలు అందక జనం.. ఉద్యోగ భద్రత లేక అనేక వర్గాలు విసుగుపోయారు.. చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు.. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేపట్టారు. ఆ వివరాలు ఇలా..
ఫ ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో దశల వారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసు అందజేశారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉద్యమిస్తున్నామని నేతలు తెలిపారు. సెప్టెంబర్ 1న ‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’ అనే నినాదంతో సెల్ఫోన్ డీపీలు ఏర్పాటు చేసి నిరసన తెలియజేయడం, 1 నుంచి 5 వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం వంటివి చేపడతారన్నారు. 2 నుంచి 8 వరకు హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమం ద్వారా కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం, సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు భోజన విరామసమయంలో నిరసనలు నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 23న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, అలాగే 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి ‘‘మా డబ్బులు మాకివ్వండి’’ నినాదంతో నిరసలు ఉంటాయన్నారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బాపిరాజు, ఏపీజేఏసీ అమరావతి విమెన్ వింగ్ చైర్పర్సన్ ఎం. నాగలకి్ష్మ్, మెన్ విభాగం సెక్రటరీ శివ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతినిధులు సెక్రటరీ సురేష్, హెచ్ఎం అసోసియేషన్, మున్సిపల్ అసోసియేషన్, అవుట్సోర్సింగ్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డీలర్ల సమస్యలు పరిష్కరించండి
రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు శివప్రసాద్ అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీలర్ చేస్తున్న డోర్ డెలివరీలో 5 కిలోల చొప్పున ప్యాకింగ్ చేయడానికి కవర్ల ఖర్చు వాటిని కార్డుదారుని ఇంటికి వెళ్లి ఇవ్వడానికి రవాణా ఖర్చు డీలర్ తనకు వస్తున్న స్వల్ప కమీషన్ నుంచి భరించాల్సి వస్తోందన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణానికి వచ్చే ప్రతి బస్తాపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, కార్డుదారునికి పంపిణీ చేసే ముందు కూడా మరోసారి స్కానింగ్ చేయాలని అధికారులు చెబుతున్నారన్నారు. ఇది ఇబ్బందిగా మారిందన్నారు. బియ్యం ఒక కిలోకి రూ.1 కమీషన్ ఇస్తుండగా రూ.3కు పెంచాలని, డీలర్లకు హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉదయేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు బుంగ రాజు, కోశాధికారి గెడ్డం పృథ్వీరాజ్ పాల్గొన్నారు.


