కోరుకొండ: అంతా అయ్యాక వచ్చి.. మళ్లీ మొదలెట్టారు అన్నట్టు ఉంది పరిస్థితి. ఆ వివరాల్లో వెళ్తే.. దోసకాయలపల్లి గురుకుల హాస్టల్లో శుక్రవారం రాత్రి కలుషితాహారం తిని 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్య సేవలు అందించడంతో వారి పరిస్థితి శని, ఆదివారాల్లో మెరుగుపడింది. ఈ మేరకు ఆదివారం డీఎంహెచ్ఓ డాక్టర్ పితాని కోమల వచ్చి హాస్టల్లోని విద్యార్థులను పరిశీలించి, ఆరోగ్యం నిలకడగా వెల్లడించారు. ఇదంతా అయ్యాక.. విద్యార్థులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం వచ్చారు. ఈ నేపథ్యంలో కోలుకున్న విద్యార్థులను మళ్లీ మంచాలపై పడుకోబెట్టి వైద్య సేవలు అందిస్తున్నట్లు, ఎమ్మెల్యే చూస్తున్నట్లు ఫొటోలు తీయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


