
అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలి
పి.గన్నవరం: మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఇసుక, మట్టి దిబ్బలు కనపడితే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. అక్రమంగా మట్టి, ఇసుకను తరలించి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇప్పటికే ఊడిమూడిలంక, యర్రంశెట్టివారిపాలెం లంక, పెదకందాల పాలెం, మానేపల్లిలంక తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక, మట్టిని తరలించి దోచుకుంటున్నారు. తాజాగా నాగుల్లంక గ్రామం వద్ద శ్మశానాన్ని తవ్వి లంకలోకి బాటలు నిర్మించారు. దీంతో గురువారం గ్రామస్తులు పార్టీలకు అతీతంగా అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. టిప్పర్ల రాకపోకల కోసం శ్మశానం మీదుగా ఏర్పాటు చేసిన బాటలను తొలగించాలని, అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. గతంలో సంభవించిన వరదల్లో తమ గ్రామం వద్ద వశిష్ట నది ఎడమ ఏటిగట్టుకు గండి ఏర్పడి తీవ్రంగా నష్టపోయామని గ్రామస్తులు వివరించారు. తమ గ్రామ ఏటిగట్టుకు కనుచూపు మేరలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిలంక నుంచి తువ్వ మట్టిని తవ్వేందుకు అక్రమార్కులు కొన్ని రోజుల నుంచి బాటలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. శ్మశానం మీదుగా బాట ఏర్పాటు ఏర్పాటు చేయడంతో సమాధుల నుంచి ఒక మృతదేహం బయటకు వచ్చిందని గ్రామస్తులు వివరించారు. ఇక్కడ అక్రమ తవ్వకాలు చేపడితే తమ గ్రామంతో పాటు, కనకాయలంక కాజ్ వేకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు, క్రిస్టియన్లు వినియోగించుకునే శ్మశాన వాటిక కనుమరుగై పోతుందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు యల్లమెల్లి చిట్టిబాబు, గ్రంధి వెంకటేశ్వరరావు, చిట్టినీడి రంగసాయి, బొక్కా ఏడుకొండలు, కారుపల్లి శ్రీను, మంగం శ్రీను, పాలూరి శ్రీను, ఆరుమిల్లి రాంబాబు, చింతా రవి, భీమాల వెంకటేశ్వర రావు, చిలకపాటి శ్రీను, మంగం రవి, గ్రంధి బాల మురళీ, కాండ్రేగుల ఆనందబాబు, కొటికలపూడి వెంకటేశ్వరరావు, పితాని ఏడుకొండలు, నూకల విశ్వేశ్వరరావు, మానుకొండ సందీప్ పాల్గొన్నారు.
గ్రామస్తుల ఆందోళన
శ్మశానాన్ని తవ్వేసి బాటల నిర్మాణం