
కూటమి ప్రభుత్వంలో యువతకు మోసం
తాళ్లపూడి (కొవ్వూరు): యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసి వారిని చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆరోపించారు. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద యువత పోరు పోస్టర్ను నియోజకవర్గ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమని రమేష్బాబు, పార్టీ నాయకుల చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం తలపెట్టిన యువత పోరు ధర్నాలో నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చంద్రబాబు ఏడాది కాలంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర బకాయిలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3 వేల భృతి తక్షణమే ఇవ్వాలన్నారు. సుమారు 3 లక్షల మంది ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తొలగించిందని చెప్పారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్బాబు మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి 2 లక్షల మంది వలంటీర్లను నియమిస్తే, గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తామని చెప్పి వారిని తొలగించారని చెప్పారు. మద్యం షాపుల్లో పనిచేసే ఉద్యోగులను, రేషన్ వాహనాలను తొలగించి వారి ఉపాధికి గండి కొట్టారన్నారు. యువత పోరులో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిట్టా శ్రీనివాస్, చాగల్లు మండల కన్వీనర్ మట్టా వెంకట్రావు, నాయకులు ఉప్పులూరి సూరిబాబు, చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, అంకోలు శ్రీపద్మ, మద్దినట్ల సాయి గీత, ఏలూరి విజయలక్ష్మి, పద్మ, కొయ్యే దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ
కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు