చల్లని తల్లి... మా కల్పవల్లి | - | Sakshi
Sakshi News home page

చల్లని తల్లి... మా కల్పవల్లి

Jun 22 2025 3:42 AM | Updated on Jun 22 2025 3:42 AM

చల్లన

చల్లని తల్లి... మా కల్పవల్లి

పెద్దాపురం: చల్లని తల్లి... మా కల్పవల్లి... మమ్మేలు మాతా అంటూ ఆ మరిడమ్మ వారిని భక్తజనం కొలుస్తుంది. ఆధ్యాత్మికతతో అలరారుతున్న, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన, ఉమ్మడి రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 24 నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా 37 రోజుల పాటు నిర్వహించే జాతర మహోత్సవాల్లో భాగంగా 24న జాతర ప్రారంభమై, జూలై 31వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏటా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శింకుంటున్నారు. నిత్యం విశేష పూజలందుకుంటూ విరాజిల్లుతున్న పెద్దాపురం మరిడమ్మ ఉత్సవాలకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చింతపల్లివారి ఆడపడుచుగా...

ఆంధ్ర, ఽతెలంగాణ రాష్ట్రాల్లో దేవతాలయాల్లో పెద్దాపురం శ్రీమరిడమ్మ అమ్మవారి దేవస్థానం ప్రసిద్ధమైంది. మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల నమ్మకం. మరిడమ్మ వారు సామర్లకోట చింతపల్లివారి ఆడపడుచుగా ప్రాచుర్యం పొందారు. ఇప్పటికీ ఆ వారుసులే ఇక్కడ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. వారి కుల దేవతగా పెద్దాపురం పట్టణంలో వెలసి యావత్‌ ఆంధ్రావని సంరక్షిస్తున్న వరదేవతగా ప్రఖ్యాతి గాంచారు. ఏటా ఆషాఢ మాసంలో 37 రోజుల పాటు జాతరను జరపడం ఆనవాయితీగా వస్తోంది.

ఆనవాయితీగా గరగ ఊరేగింపు

ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరకు ఉన్న ప్రత్యేకతతో పాటు గరగకు విశిష్ట పూజలు నిర్వహిస్తుంటారు. జాతర ఆరంభానికి ముందు నుంచీ తొలి గరగను ఊరేగించడం ఆనవాయితీ. పురవీధుల్లో గరగ తిరుగుతూ డప్పు వాయిద్యాలతో ఊరేగిస్తుంటే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అమ్మవారికి పాన్పు, చీరలు వేయడం, కోరిన కోర్కెలు తీర్చడంతో ముడుపులు, మొక్కులు తీర్చుకునేందుకు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తుంటారు.

వారానికో వీధి సంబరం

గ్రామ దేవతగా ఆరాధించే పెద్దాపురంలో ఆయా వీధుల వారు అమ్మవారి సంబరాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రూ.లక్షలు వెచ్చించి అమ్మవారి సంబరం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వీధి సంబరాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఆయా ఉత్సవ కమిటీలు సిద్ధమవుతున్నాయి. ఇది పట్టణంలో ప్రత్యేకతను చాటనుంది.

24 రాత్రి నుంచి జాతర

ఏటా ఆషాఢ మాసం ఆరంభంలో నిర్వహించే మరిడమ్మ వారి జాగరణ మహోత్సవంలో భాగంగా ఈ నెల 24న రాత్రి అంగరంగ వైభవంగా జాతర ప్రారంభం కానుంది. దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే హాజరవుతారు. జాతరకు సంబంధించి ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆసాదులు, వేదపండితులతో అమ్మవారి జాతర ఉత్సవం నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌ దీపాలతో సెట్టింగ్‌లు వేశారు.

పెద్దాపురం మరిడమ్మ జాతరకు వేళాయె

తెలుగు రాష్ట్రాల్లోనే వేడుకలకు ప్రసిద్ధి

24 నుంచి జాతర మహోత్సవం

అమ్మవారి కృపకు పాత్రులుకండి

కోరిన కోర్కెలు తీర్చే మరిడమ్మ వారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలి. ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై జాతరను విజయవంతం చేయండి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఏడాది ఉత్సవాలను మరింత వేడుకగా నిర్వహించనున్నాం.

– విజయలక్ష్మి, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, పెద్దాపురం

చల్లని తల్లి... మా కల్పవల్లి1
1/3

చల్లని తల్లి... మా కల్పవల్లి

చల్లని తల్లి... మా కల్పవల్లి2
2/3

చల్లని తల్లి... మా కల్పవల్లి

చల్లని తల్లి... మా కల్పవల్లి3
3/3

చల్లని తల్లి... మా కల్పవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement