
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: ఏకాదశి పర్వదినం కావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వందలాదిగా భక్తుల రాక ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి మరీ స్వామిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను అర్చకులు విశేషంగా అలంకరించి, భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యాన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాతల ఆర్థిక సాయంతో 7 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. భక్తులకు ప్రతి శనివారం అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్వామి వారి పూలాలంకరణ, ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం తదితర కార్యక్రమాలకు విరాళాలు స్వీకరిస్తున్నామని చెప్పారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నిత్యం యోగా సాధన చేయడం సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక గ్రాండ్ ట్రంక్ రోడ్డు నుంచి లాలాచెరువు సెంటర్ వద్ద గల సూర్య నమస్కారాల పార్కు వరకూ శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. అలాగే, సరస్వతీ ఘాట్, గౌతమ ఘాట్లో సాంఘిక సంక్షేమం, ఆయుష్, ఏపీ టూరిజం, మున్సిపల్, వైద్య విభాగం సంయుక్త ఆధ్వర్యాన యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నెల రోజుల పాటు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని అన్నారు. 4,500 వేదికల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, ఘాట్లు, ముఖ్య కూడళ్లు, సచివాలయాల పరిధిలో యోగా దినోత్సవం విజయవంతంగా జరిగాయన్నారు. యోగా గురువులుగా నమోదైన వారికి, మూడు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి పరిరక్షించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అధిక ఉష్ణోగ్రతల నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. స్థానిక ఏకేసీ డిగ్రీ కళాశాల సమీపాన శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలసి ఆమె పాల్గొన్నారు. ఉద్యోగులు, స్థానికులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరైన రీతిలో తొలగించకపోతే, వాటి నుంచి వెలువడే లెడ్ వంటి రసాయనాలు ప్రజలకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయని అన్నారు. దీని వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదముందన్నారు. వీటిని ఈ–వ్యర్థాల సేకరణ కేంద్రంలో అందజేస్తే సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి, ముప్పు తప్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు

అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు