
కసు్సబసు్సలు
బోసిపోయిన బస్టాండ్లు
ఉమ్మడి జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోల నుంచి 502 బస్సులను విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి తరలించుకుపోయారు. ఇంతకు రెట్టింపు సంఖ్యలో ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను రవాణాశాఖాధికారుల ద్వారా నయానా భయానా దారికి తెచ్చుకుని వినియోగించారు. విద్యా సంస్థల బస్సుల మాటెలా ఉన్నా ఆర్టీసీ బస్సులు తగినన్ని లేకపోవడంతో ఆయా బస్టాండ్లలో ప్రయాణికులు శుక్ర, శనివారాల్లో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేక ఆర్టీసీ బస్టాండ్లు బోసిపోయాయి. దూర ప్రాంతాలతో పాటు పల్లెవెలుగు బస్సులు కూడా తగినన్ని లేకపోవడంతో ప్రయాణికులు నరకం కళ్లజూశారు. బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు పడ్డారు. పల్లెలకు వెళ్లే సర్వీసులను దాదాపు రద్దు చేశారు. నడినెత్తిన సూరీడు చుర్రుమంటున్నా.. రోడ్డు పైనే బస్టాప్ల వద్ద గంటల తరబడి చెమటలు కక్కుతూ పడిగాపులు పడ్డారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పలువురు ప్రయాణికులు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో ఆటోలకు డబుల్ చార్జీలు కూడా డిమాండ్ చేశారు. పలుచోట్ల ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణించారు.
●
● ప్రయాణికులకు ‘యోగాంధ్ర’ కష్టాలు
● ఉమ్మడి ‘తూర్పు’ నుంచి
502 బస్సులు ‘చలో వైజాగ్’
● ప్రయాణాలకు నరకం చూసిన జనం
● ఆర్టీసీ బస్టాండ్లలో గంటల
తరబడి పడిగాపులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆర్టీసీ బస్సు రూటు మారింది.. యోగాంధ్ర రికార్డు కోసం విశాఖపట్నం దారి పట్టింది.. ఫలితంగా ఇబ్బందులు పడటం ప్రయాణికుల వంతయ్యింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిని గొప్పగా నిర్వహించామని చెప్పుకొనేందుకు, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రహసనం నడిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వారం రోజులుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులనూ యోగాంధ్ర కార్యక్రమం పైనే మోహరించారు. దీనికి ముగింపుగా విశాఖలో ప్రధాని పాల్గొనే యోగా దినోత్సవానికి భారీగా జనాల్ని తరలించేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి వందలాదిగా ఆర్టీసీ బస్సులతో పాటు వివిధ ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల బస్సులను వినియోగించారు. దీనికోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించింది.
జిల్లాల వారీగా..
● కాకినాడ జిల్లా నుంచి ఆర్టీసీ 155 బస్సులను విశాఖకు తరలించారు. ఈ నేపథ్యంలో కాకినాడ – రాజమహేంద్రవరం, కాకినాడ – అమలాపురం నాన్స్టాప్ సర్వీసులను కుదించేశారు. నాన్స్టాప్ బస్సుల కోసం గంట, రెండు గంటల పాటు వేచి చూడాల్సిన దుస్థితి ఎదురవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ – రాజమహేంద్రవరం, కాకినాడ – విజయవాడ సర్వీసులలో కోత పెట్టారు. కాకినాడ నుంచి మెట్ట ప్రాంతమైన జగ్గంపేట, గోకవరం, ఏలేశ్వరం, తుని తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్డినరీ సర్వీసులలో రెండింతలు కోత పెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
● తూర్పు గోదావరి జిల్లాలోని 4 డిపోల నుంచి 185 బస్సులను విశాఖకు తరలించుకుపోయారు. రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు ఆర్టీసీ డిపోల్లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు మండిపడ్డారు. రాజమహేంద్రవరం మెయిన్ బస్టాండుతో పాటు రైల్వేస్టేషన్, గోకవరం బస్టాండ్, కోటిపల్లి బస్టాండ్ల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించారు.
● కోనసీమ జిల్లాలోని 4 డిపోల నుంచి మొత్తం 162 బస్సులను విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి తరలించారు. అమలాపురం నుంచి విజయవాడకు ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచేది. అటువంటిది విశాఖకు బస్సులు తరలించేయడంతో రెండు గంటలకొకటి చొప్పున మాత్రమే బస్సులు నడపడంతో ప్రయాణికులు నానా కష్టాలూ పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు, నైట్ సర్వీసులు సైతం దాదాపు మూడు వంతులు రద్దు చేశారు. అమలాపురం – కాకినాడ నాన్స్టాప్ సర్వీసులను కూడా తగ్గించేశారు. ఈ రూటులో ప్రతి అరగంటకు ఒక నాన్స్టాప్ తిరిగేది. చలో విశాఖ ప్రభావంతో రెండు గంటలైనా నాన్స్టాప్ సర్వీసు లేక ప్రయాణికులు నరకం చవి చూశారు. విజయవాడ, విశాఖపట్నంతో పాటు పల్లె వెలుగు సర్వీసులను కొన్ని రూట్లలో రద్దు చేశారు. అమలాపురం, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు డిపోల నుంచి తక్కువ సంఖ్యలోనే బస్సులు నడపడం జనానికి శాపంగా మారింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి డిపోల వారీగా విశాఖకు తరలించిన ఆర్టీసీ బస్సులు
డిపో మొత్తం విశాఖకు మిగిలినవి
బస్సులు తరలించినవి
కాకినాడ 166 66 100
తుని 72 44 28
ఏలేశ్వరం 49 45 4
అమలాపురం 143 60 83
రావులపాలెం 71 41 30
రామచంద్రపురం 52 40 12
రాజోలు 53 21 32
రాజమహేంద్రవరం 148 77 71
గోకవరం 63 44 19
కొవ్వూరు 52 39 13
నిడదవోలు 37 25 12