
ఉపాధ్యాయుల సర్దుపాట్లు
ఖాళీలను పరిశీలిస్తే..
ఉమ్మడి జిల్లాలో మండలాల వారీగా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఇలా.. అడ్డతీగల మండలంలో 19, అయినవిల్లి 10, అల్లవరం 19, అమలాపురం 1, అంబాజీపేట 6, అనపర్తి 1, ఆత్రేయపురం 11, బిక్కవోలు 4, చింతూరు 36, దేవీపట్నం 11, గండేపల్లి 24, గంగవరం 7, గొల్లప్రోలు 1, ఐ.పోలవరం 48, జగ్గంపేట 47, కె.గంగవరం 21, కాజులూరు 7, కపిలేశ్వరపురం 20, కాట్రేనికోన 101, కిర్లంపూడి 38, కొత్తపేట 28, కూనవరం 36, మలికిపురం 8, మామిడికుదురు 10, మండపేట 3, మారేడుమిల్లి 17, ముమ్మిడివరం 23, నెల్లిపాక 52, పి.గన్నవరం 38, పెద్దాపురం 1, ప్రత్తిపాడు 46, రాజవొమ్మంగి 5, రంపచోడవరం 22, రంగంపేట 22, రావులపాలెం 10, రాజోలు 1, రౌతులపూడి 9, సఖినేటిపల్లి 10, శంఖవరం 21, సీతానగరం 6, తాళ్లరేవు 4, తొండంగి 18, ఉప్పలగుప్తం 34, వీఆర్ పురం 42, వై.రామవరం 16, ఏలేశ్వరం మండలంలో 16 ఖాళీలు ఉన్నాయి.
ఫ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా
ఫ దూర ప్రాంతాలకు వెళ్లేది లేదని నిరసన
రాయవరం: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల అనంతరం పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్ల (ఎంటీఎస్)తో సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆదివారం కాకినాడలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించింది. అయితే తమకు బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ ఎంటీఎస్ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 410 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో 2008 డీఎస్సీ బ్యాచ్ 199 మంది, 1998 డీఎస్సీ బ్యాచ్ 211 మంది ఉన్నారు. వీరంతా మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..
కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆదివారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. అక్కడ ధర్నాకు దిగారు. ఇటీవల జరిగిన రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల అనంతరం సుదూర ప్రాంతాల్లోనే ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాలకు దూరంగా 100 నుంచి 200 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని వారు వ్యతిరేకిస్తున్నారు. అసలే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 70 శాతం మంది ఉపాధ్యాయులు రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు.
వారి డిమాండ్లు ఇవీ..
కేవలం రూ.32 వేలతో పనిచేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లోనే సర్దుబాటు చేయాలి. ప్రతి మండలంలో ఉన్న మోడల్ స్కూల్స్లో ఒక ఎంటీఎస్ టీచర్ను నియమించాలి. ప్రస్తుతం ప్రభుత్వం చూపిస్తున్న ఖాళీలు నివాసాలకు 200 కి.మీ దూరంలో ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి వస్తే హెచ్ఆర్ఏ, డీఏ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో క్లస్టర్ వేకెన్సీలు క్రియేట్ చేసి, ఎంటీఎస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించాలి. మున్సిపల్ పాఠశాలల్లో వేకెన్సీలను కూడా చూపించాలి. 15 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రతి పాఠశాలలో ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించాలి. గతంలో విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నియర్ బై రెసిడెన్స్ అవకాశం కల్పించాలి.
● ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ఉదయం 9 నుంచి జరగాల్సి ఉండగా, వీరి ఆందోళన, చర్చల నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు మొదలైంది. ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో వారు కౌన్సెలింగ్కు హాజరయ్యారు.