
ఇదిగో సహకారం
● సంఘాల ప్రతినిధులకు నేటితో ముగియనున్న శిక్షణ ● జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ
రాజానగరం: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు సాగు రుణాలను అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్నాయి.. అయితే వివిధ రకాల పంటలకు కాలానుగుణంగా ఏ రకమైన ఎరువులను వాడాలనే పరిజ్ఞానం ఎరువులు పంపిణీ చేసే సిబ్బందికి అంతగా ఉండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించి, రైతులకు అందించే ఎరువులపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో సహకార సంఘాల ప్రతినిధులకు ‘సమగ్ర పోషక యాజమాన్యం’పై రాజానగరం మండలం దివాన్చెరువులోని జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో 14 రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది సోమవారంతో ముగియనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 15 వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చెందిన 30 మంది ప్రతినిధులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.
ఏ ఏ అంశాలంటే..
సమగ్ర పోషక యాజమాన్యంపై సర్టిఫికెట్ కోర్సులో భాగంగా 15 రోజులపాటు ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. నేలలు – రకాలు, వాటిని సారవంతం చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, సమస్యాత్మక భూముల సవరణ, మట్టి నమూనాల సేకరణ, పరీక్షలు, జీవన ఎరువులు, ఎరువుల వాడకం, స్థూల, సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడం, పంటలో పోషక లోపంతో కలిగే నష్టాలు, వాటిని గుర్తించే విధానం – నివారణ, భూసారం పెంపునకు సమర్థ ఎరువుల వినియోగంపై వివరిస్తున్నారు. అలాగే సూక్ష్మజీవులకు సంబంధించిన జీవన ఎరువులు – విశిష్టత, పంట మార్పిడితో ప్రయోజనాలు, వంటి వివిధ అంశాలపై ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ చల్లా వెంకట శ్రీనివాసరావు, డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పీవీ రమేష్లతోపాటు రాజమహేంద్రవరంలోని వ్యవసాయ కళాశాలలోని వివిధ విభాగాల అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి, వివిధ రకాల పంటల సాగుపై అవగాహన కల్పించారు.