
జాతీయ తైక్వాండో పోటీలకు తూర్పు క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉత్తరాఖండ్లో ఈ నెల 23 నుంచి 25 వరకూ జరిగే జాతీయ తైక్వాండో పోటీలకు 18 మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు పయనమయ్యారని తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు ఆదివారం తెలిపారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో జరిగే పోటీలకు 11 మంది బాలికలు, ఏడుగురు బాలురు హాజరవుతున్నారన్నారు. వీరంతా ఇటీవల అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించారన్నారు. జాతీయస్థాయి పోటీలకు హాజరవుతున్న క్రీడాకారులను డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, తైక్వాండో సంఘ కార్యదర్శి అర్జునరావు, కోచ్లు డీఎన్ సత్యనారాయణ, కేవీ సత్యనారాయణ, పి.త్రిమూర్తులు అభినందించి, పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.