
వాడపల్లికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొద్దాం
● సిబ్బందికి ఈఓ చక్రధరరావు దిశానిర్దేశం
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా, రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలనే లక్ష్యానికి సిబ్బంది సహకారం అవసరమని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వాడపల్లి ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై ఆదివారం దేవస్థానం కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. భక్తులకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలపై సమీక్షించారు. ఈ విషయాల్లో సిబ్బంది నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. భక్తులు పూర్తి సంతృప్తిగా స్వామి దర్శనం చేసుకుని వెళ్లేలా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అందరూ చిత్తశుద్ధితో పనిచేద్దామని ఆయన అన్నారు.
ఫ వాడపల్లి క్షేత్రంలో వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం వాస్తవ్యులు భీమా శ్రీధర్, శ్రీవల్లి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. దాతలకు స్వామివారి చిత్రపటాన్ని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు. ఆలయంలో నిత్య పూజల్లో భాగంగా స్వామివారి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తుల అష్టోత్తర నామార్చన పూజలు జరిగాయి. ఆదివారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేదాశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ తదితర సేవల దేవస్థానానికి రూ.6,58,733 ఆదాయం వచ్చింది.

వాడపల్లికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొద్దాం