
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
కోరుకొండ/సీతానగరం: సీతానగరం మండలం రఘుదేవపురం పరిధిలోనిరొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన పేట్ల సుబ్రహ్మణ్యం (27) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సీతానగరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాస్ కథనం ప్రకారం.. కోటి గ్రామానికి దగ్గరలోని రఘుదేవపురం పరిధిలో సురవరపు వెంకట అప్పారావు రొయ్యల చెరువు వద్ద పేట్ల సుబ్రహ్మణ్యం కొంతకాలంగా కూలీ నిమిత్తం పనిచేస్తున్నాడు. ఆదివారం చెరువు వద్ద బోరుకు విద్యుత్ సరఫరా రాకపోవడంతో అక్కడే ఉన్న కరెంట్ స్తంభం వద్ద జంపర్ కట్టి, ఎడ్జీ ఫ్యూజ్ వేసే సందర్భంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. సహచరులు గమనించి సీతానగరం బస్టాండ్ సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి నుంచి చెరువు వద్దకు వెళ్లిన సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు రోదిస్తున్నారు. మృతుడి తండ్రి శ్రీను వ్యవసాయ కూలీ. తండ్రికి చేదోడుగా ఉంటున్న సుబ్రహ్మణ్యం మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
జీవితంలో
యోగా భాగం కావాలి
● తిరుమల విద్యా సంస్థల చైర్మన్
నున్న తిరుమలరావు
రాజమహేంద్రవరం రూరల్: ఆరోగ్యాంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని తిరుమల జూనియర్ కళాశాలలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నున్న తిరుమలరావు మాట్లాడుతూ మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త ఉపశమనాన్ని పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు నేడు ఎంతోమంది యోగా చేసేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. యోగా టీచర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగాసనాలను వేయించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతానికి యువకుడి మృతి