
నైపర్లో హర్షిత్రెడ్డికి 93వ ర్యాంకు
రాజమహేంద్రవరం రూరల్: పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( నైపర్) సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలో రాజమహేంద్రవరానికి చెందిన కొవ్వూరి హర్షిత్రెడ్డి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించాడు. జనరల్ కేటగిరీలో ఆలిండియా 93వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 18వ ర్యాంక్ సొంతం చేసుకున్న అతడు దివాన్ చెరువులోని వీజే ఫార్మసీ కళాశాలలో బీఫార్మ్ పూర్తిచేశాడు. కళాశాల యాజమాన్యం తరఫున ఎన్.జగన్మోహనరెడ్డి, ప్రిన్సిపాల్ డి. నరేంద్ర, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జక్కంపూడి రాజా తదితరులు హర్షిత్ రెడ్డిని అభినందించారు. సుదీర్ఘ కాలం తరువాత స్థానిక యువకుడు ఈ ఘనత సాధించడం హర్షణీయమని వారు పేర్కొన్నారు.
తలుపులమ్మ తల్లి ఆదాయం రూ.7.75 లక్షలు
తుని రూరల్: తలుపులమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి 35వేల మంది భక్తులు వివిధ వాహనాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,63,550, పూజా టికెట్లకు రూ.2,77,160, తలనీలాలకు రూ.27,360, వాహన పూజలకు రూ.5,040, వసతి గదులు, కాటేజీలు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.85,696, విరాళాలు రూ.1,17,012, మొత్తం రూ.7,75,818 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. కాగా దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో సోమవారం ఉదయం 8 గంటలకు హుండీలను లెక్కించనున్నట్టు ఈఓ తెలిపారు.
రండి... ఒలింపిక్ రన్కు..
అమలాపురం టౌన్: అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే.. రండి కలసి పరుగెడదామనే నినాదంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అమలాపురం పట్టణంతో పాటు జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో సోమవారం ఉదయం ఒలింపిక్ రన్లు నిర్వహిస్తోంది. దీనిపై స్థానిక దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన తండ్రి దివంగత, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో గత 25 ఏళ్లుగా అమలాపురంతోపాటు మండల కేంద్రాల్లో ఒలింపిక్ రన్లను నిర్వహించారని గుర్తు చేశారు. ఈ ఏడాది తన తండ్రి భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ జిల్లా ఒలింపిక్ రన్ స్ఫూర్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ సోమవారం ఉదయం 8 గంటలకు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నుంచి రన్ను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఒలింపిక్ టార్చ్ను వెలిగించి ప్రారంభిస్తారన్నారు. ఈ రన్ల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఽధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు.

నైపర్లో హర్షిత్రెడ్డికి 93వ ర్యాంకు