
దగాపై దండయాత్ర!
● కుటిల హామీలపై యువత ఆగ్రహం
● 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రగల్భాలు
● ఏటా జాబ్ క్యాలెండర్పై అసత్యాలు
● 5.09 లక్షల మందికి మోసం
● ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
● విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున
నేడు వైఎస్సార్ సీపీ యువత పోరు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలిస్తాం.. లేదా నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం తమ్ముళ్లూ..శ్రీ అంటూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని ఊదరగొట్టారు. తీరా అధికారం చేతికి వచ్చాక ఆ ఊసే లేకుండా విస్మరించారు. ఉద్యోగాల కల్పన కలగా, నిరుద్యోగ భృతి భ్రాంతిగా మారింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడుస్తున్నా వాటికి అతీగతీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. యువత, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాపై వైఎస్సార్ సీపీ కదం తొక్కుతోంది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
నిరుద్యోగ భృతికి మంగళం
సార్వత్రిక ఎన్నికల హామీల్లో భాగంగా టీడీపీ రూపొందించిన సూపర్ సిక్స్లో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి మొదటి స్థానంలో ఉన్నాయి. జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించి ఆదుకుంటానని చంద్రబాబు జిల్లా పర్యటనల్లో ఊదరగొట్టారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి అయినా అందజేస్తామని ప్రకటనలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా రెండు అంశాల ఊసే లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయంటూ డిగ్రీ, ఇంటర్, పదో తరగతి చదివిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేందుకు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి మరీ శిక్షణ పొందుతున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బతుకుబండి సాగేందుకు చిరు వ్యాపారాలు చేసుకుంటున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారు.
బకాయిలు రూ.152 కోట్లు
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 5,09,611 కుటుంబాలున్నాయి. 18,32,332 జనాభా నివసిస్తోంది. ఏటా ఇంటర్మీడియెట్ కళాశాలల నుంచి మూడు వేలు, డిగ్రీ కళాశాలల నుంచి 8 వేలు, బీటెక్, ఎంటెక్, డిప్లమా కోర్సుల నుంచి మరో 2 వేల మంది ఉత్తీర్ణులు అవుతున్నారు. ఇందులో కొందరు ఉద్యోగాలు చేస్తున్నా.. మరి కొందరు ఖాళీగా ఉంటున్నారు. ప్రతి ఇంట్లో ఒక్క నిరుద్యోగి అయినా ఉంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం 5.09 లక్షల కుటుంబాలకు ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన సుమారు రూ.152 కోట్లు నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది.
ఎందరికో శాశ్వత ఉద్యోగాలు
2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో 512 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. 5,120 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ప్రసుత్తం అందులో 3,158 మంది పనిచేస్తున్నారు. మిగిలిన వారు బదిలీలు తదితర ప్రక్రియల్లో ఉన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 9,579 మందికి గ్రామ, వార్డు వలంటీర్ పేరుతో తాత్కాలిక ఉపాధి కల్పించారు. వైద్య శాఖలో జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. శాశ్వత, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా వేలాది మంది ఉపాధి చూపారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో ఏటా క్రమం తప్పకుండా రీయింబర్స్మెంట్ అందించేవారు. కళాశాలలను గ్రేడులుగా విభజించి ఏ గ్రేడ్ కళాశాలలో చదివే వారికి ఏడాదికి రూ.18,400, బీ గ్రేడ్ కళాశాలకు రూ.15,300 చొప్పున గత ప్రభుత్వం చెల్లించేది. ఆ సొమ్ముతో విద్యార్థులు ఫీజులు కట్టేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో జిల్లాలోని 70,241 మంది విద్యార్థులకు రూ.142.99 కోట్లు చెల్లించింది. జగనన్న వసతి దీవెన పథకం కింద నాలుగేళ్లలో 69,098 మంది విద్యార్థులకు రూ.65.56 కోట్లు జమ చేసింది.

దగాపై దండయాత్ర!

దగాపై దండయాత్ర!