అమలాపురం టౌన్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో విద్యార్థి సంఘాలు దేశ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ జిల్లాలోనూ విజయవంతమైంది. పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక గడియారం స్తంభం సెంటర్, మద్దాలవారిపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాలు నిర్వహించారు. నీట్ పరీక్ష వంటి పోటీ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. నీట్ పరీక్ష పేపరు లీకేజీని తట్టుకోలేక మృతి చెందిన 22 మంది విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు కె.శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, వీసీకే పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ, పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


