ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలే
బాణసంచా తయారీదారులకు ఎస్పీ హెచ్చరిక
అమలాపురం టౌన్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లాలోని బాణసంచా తయారీ, విక్రయదారులను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదం, ఆస్తి, ప్రాణ నష్టాల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న తయారీ కేంద్రాలను మూయించి వేసినట్లు ఎస్పీ మీనా తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో జిల్లాలో పలు స్టేషన్ల పరిధిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాలను సీఐలు, ఎస్సైలు తనిఖీలు చేశారన్నారు. భద్రతా ప్రమాణాలు విధిగా పాటించాలని తయారీ కేంద్రాల నిర్వాహకులు, విక్రయదారులకు సూచించారు. ఈ కేంద్రాలు ఎక్స్ప్లోజివ్ యాక్ట్కు అనుగుణంగా ఉన్నాయా.. లేదా..? అనే అంశంపై వాటిని పరిశీలించారు. కేంద్రాల వద్ద అగ్నిమాపక పరికరాలు, తగినంత నీటి, ఇసుక నిల్వలు సిద్ధంగా ఉంచాలని సీఐలు, ఎస్సైలు సూచించారు. లేనిపక్షంలో కేంద్రాల లైసెన్స్లు రద్దు చేస్తామని ఎస్పీ మీనా హెచ్చరించారు. అలాంటి కేంద్రాలు తనిఖీల్లో కనిపిస్తే తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు. అలాగే బాణసంచా అక్రమ నిల్వలపై నిఘా పెంచామన్నారు.


