పెన్షనర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
అమలాపురం టౌన్: పెన్షనర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందని ఏపీ స్టేట్ ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు తెలిపారు. అయినా పెన్షనర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్టేట్ పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా శాఖ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం స్థానిక ఏవీఆర్ నగర్లోని అసోసియేషన్ భవనంలో జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎం.సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెన్షనర్లకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పెన్షనర్లకు ఇన్సూరెన్స్ బేస్డ్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 24 నెలలు గడుస్తున్నా ఇంకా 12వ పే కమిషన్ నియమించకపోవడంపై సరికాదాన్నరు. రాష్ట అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. ప్రభుదాస్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మూడు డీఏలు మంజూరు చేయాలన్నారు. అనంతరం అమలాపురంలోని జిల్లా అసోసియేషన్ భవనం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల ఆద్యుడు దివంగత డీఎస్ నకార విగ్రహాన్ని రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ప్రతినిధులు మండలీక ఆదినారాయణ, మెహబూబ్ షహీరా, శ్రీగిరి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన అధ్యక్షుడిగా కృష్ణమూర్తి
అనంతరం జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా ఆచంట రామారాయుడు, సహాయ ఎన్నికల అధికారిగా మేడేపల్లి వీరభద్రరావు వ్యవహరించారు. జిల్లా నూతన కార్యవర్గంతో వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్వీఎస్ఎస్సీహెచ్ కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కేకేవీ నాయుడు, ఉపాధ్యక్షుడిగా కేఎస్ రత్నసాగర్, కోశాధికారిగా బందా రత్నాకర కామేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా కాండూరి శ్రీనివాసరావుతో పాటు 16 మంది పలు పదవులకు ఎన్నికయ్యారు. వీరితో పాటు 35 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.


