ఏబీసీడీ ఫుడ్ కోర్టుకు ˘ రూ.11 వేల జరిమానా
అమలాపురం టౌన్: అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టు (హోటల్)లో నిల్వ మాంసంతో ఆహారం పెట్టారంటూ వచ్చిన ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ బుధవారం ఆ హోటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిపై ఒక వినియోగదారుడు మంగళవారం రాత్రి మున్సిపాలిటీ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆ హోటల్ను తొలుత మున్సిపల్ ఇన్విరాల్మెంట్ ఏఈ వెంకటేష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సిబ్బంది తనిఖీ చేశారు. లోపల పలు విభాగాల్లో అపరిశుభ్రత ఉందని పేర్కొంటూ హోటల్ యాజమాన్యానికి రూ.వెయ్యి జరిమానా విధించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్యతో మున్సిపల్ కమిషనర్ నిర్మల్కుమార్ ఫోన్లో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో జరిగిన పాలు కల్తీ ఘటన నేపథ్యంలో కోనసీమ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్య అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ రంగంలోకి దిగి ఏబీసీడీ ఫుడ్ కోర్టును స్వయంగా తనిఖీ చేశారు. ఫుడ్ కోర్టులో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పారు. ఫుడ్ కోర్టులో నూనెను రీయూజ్డ్ చేస్తున్నారని, మాంసాన్ని ఫ్రిజ్ల్లో ఉంచి వాడుతున్నారని, మసాలా దినుసుల ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఐ ముద్ర లేదని గుర్తించారు. కొన్ని మాంసాహార పదార్థాలను, మసాలా ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ తప్పిదాలపై అధ్యయనం చేసిన కమిషనర్.. హోటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. సీజ్ చేసిన ఆహార వస్తువులతో పాటు సేకరించిన ఆహార శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అందజేస్తామని కమిషనర్ నిర్మల్కుమార్ తెలిపారు. హోటల్ యాజమాన్యానికి తొలుత తమ ఇన్విరాల్మెంట్, శానిటేషన్ సిబ్బంది తనిఖీలో రూ. వెయ్యి. తన తనిఖీలో రూ.10 వేలు.. మొత్తం రూ.11 వేల జరిమానా విధించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ తనిఖీల్లో వార్డు సచివాలయ ఇన్విరాల్మెంట్, శానిటేషన్ సెక్రటరీ బండి వీరన్న పాల్గొన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి రామయ్య తనిఖీ
అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టు హోటల్ను జిల్లా ఫుడ్ సేఫ్టీ అదికారి వై.రామయ్య బుధవారం రాత్రి తనిఖీ చేశారు. అక్కడి మాంసాహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు.


