సోషల్ మీడియాపై నిఘా పెంచాలి
● ఎస్పీ రాహుల్ మీనా ఆదేశం
● జిల్లా నేర సమీక్షా సమావేశం
అమలాపురం టౌన్: సోషల్ మీడియాపై, వాట్సాప్ గ్రూప్లపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పెంచాలని ఎస్పీ రాహుల్ మీనా ఆదేశించారు. కులపరమైన సమస్యలు తలెత్తకుండా పట్టణాలు, గ్రామాల్లో స్థానికులతో శాంతి కమిటీలు నెలకొల్పాలని సూచించారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే పక్షం రోజుల్లో జిల్లాలో జరగనున్న పండగలు, జాతరల దృష్ట్యా బందోబస్తుపరంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సోషల్ మీడియాలోనే కాకుండా జాతర్లతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) డేటా ఆధారంగా జిల్లాలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ సమీక్షించారు. మూడేళ్లకు పైబడి పెండింగ్లో ఉన్న కేసులపై చర్చించారు. పెండింగ్లో ఉన్న వారెంట్లు, అరెస్ట్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి 14న లోక్ అదాలత్ల్లో నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ గస్తీ పెంచాలని సీఐలు, ఎస్సైలకు సూచించారు. జిల్లాలోని జాతీయ రహదారులపై అర్ధరాత్రి దాటాక హెవీ వెహికల్స్ డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారకుండా వారి ముఖాలు నీళ్లతో కడిగిస్తూ స్టాప్, వాష్ అండ్ గో కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, బి.రఘువీర్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు పాల్గొన్నారు.


