విద్యార్థీ.. విజయోస్తు
సమన్వయంతో
విజయవంతం చేస్తాం
విద్య, పోలీస్ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను విజయవంతం చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు. పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశాం. విద్యార్థులు చాలా సౌకర్యవంతంగా పరీక్షలు రాసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశాం. హాల్ టిక్కెట్ల విషయంలో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఏ మాత్రంఇబ్బంది పెట్టవద్దు. అలా ఎవరైనా చేసినట్టు సమాచారం ఇస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఐ.శారద, ఆర్ఐఓ,
తూర్పుగోదావరి డీఈసీ కన్వీనర్
12 వరకూ గదిలో ఉండాల్సిందే
3 గంటల పరీక్షా సమయంలో అరగంట ముందు బయటకు వచ్చేసే వెసులుబాటును రద్దు చేశారు. విద్యార్థి మూడు గంటలు పూర్తిగా పరీక్ష గదిలో ఉండాలి. 9 గంటలకు కచ్చితంగా పరీక్ష ప్రారంభమవుతుంది. సమయ పాలనను పాటించి తీరాలి.
– కేశవరావు, డీఈసీ కన్వీనర్, కాకినాడ జిల్లా
● నేటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
160 కేంద్రాల్లో నిర్వహణ
● సన్నద్ధమవుతున్న విద్యార్థులు
● అరగంట ముందే బయటకు
వచ్చే వీలు లేదు
● మొదటి ఏడాది విద్యార్థులకు
32 పేజీల బుక్లెట్
కపిలేశ్వరపురం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి మార్చి 24 వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొదటి సంవత్సరం 60,260 మంది, రెండో సంవత్సరం 56,574, మొత్తంగా 1,16,834 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా సూచనలిచ్చారు. అదేరోజు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడలలో ఆయా జిల్లాల పరీక్షల నిర్వహణ అధికారులు, సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు.
టైమ్ టేబుల్ మార్పులు ఇలా
మార్చి 3న జరగాల్సిన ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, సివిక్స్ పేపర్లు 4న, మార్చి 20న జరగాల్సిన ప్రథమ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్లు 21న నిర్వహించనున్నారు. మార్చి 3న హోలీ, మార్చి 20న రంజాన్ రావడంతో ఈ మార్పులు చేశారు.
పర్యవేక్షణాధికారులు ఇలా
తూర్పుగోదావరి జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్గా ఆర్ఐఓ ఐ.శారద, కోనసీమ జిల్లా డీఐఈఓ కె.చంద్రశేఖర్బాబు, పోలవరం జిల్లా డీఐఈఓ ఎస్.భీమశంకరరావు, కాకినాడ జిల్లా కన్వీనర్గా డీఐఈఓ కేశవరావు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.
సమయపాలనకు ప్రాధాన్యం
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల ఈ వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. 8.30కి పోలీస్ స్టేషన్ నుంచి పేపర్లు తెచ్చి 8.45కి తెరుస్తారు. విద్యార్థి 12 గంటల వరకూ పరీక్ష గదిలో విధిగా ఉండాలి. గతంలో అరగంట ముందే వెళ్లిపోయే వెసులుబాటును రద్దు చేశారు.
నిర్వహణ ఏర్పాట్లు
ఏపీ పబ్లిక్ పరీక్షల చట్టం 1997 ప్రకారం నిబంధనలు రూపొందించారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్జేడీ, డీవీఈఓ, డీఐఈఓ, ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ అధ్యాపకులు, సబ్జెక్ట్ నిపుణులతో హైపవర్ కమిటీ ఈ పరీక్షలను పర్యవేక్షించనుంది. కేంద్రాల వద్ద భారత న్యాయ సంహిత సెక్షన్ 163 అమలులో ఉంటుంది. స్టేట్ టోల్ఫ్రీ నంబరు 1800–425–1531తో పాటు జిల్లాకు ఒక కంట్రోల్ రూం నంబర్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోని సూపరింటెండెంట్తో సహా కింది స్థాయి సిబ్బంది వరకూ ఎలాంటి వ్యక్తిగత ఫోన్లు వాడకూడదు. బోర్డు సమకూర్చిన ఫోన్, సిమ్కార్డులను మాత్రమే వాడుతారు. కేంద్రాల వద్ద మట్టికుండలో తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలకు సంబంధించి పేపర్లు ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. వాటికి సీసీ కెమేరాలతో నిఘా పెట్టారు. ప్రతి పరీక్షా కేంద్రానికి జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. అలాగే విద్యార్థుల సౌకర్యం కోసం నో యువర్ సెంటర్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్. పోలీసులతో కలిసి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, జిల్లా హైపవర్ కమిటీ ఈ పరీక్షలను పర్యవేక్షించనుంది. జిల్లా విద్యాశాల నుంచి 317 మందిని ఇన్విజిలేటర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. పోలీస్స్టేషన్ నుంచి ప్రశ్నా పత్రాలను ఆయా కేంద్రాలకు రెండు చక్రాల వాహనాలపై తీసుకెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు.
ఆన్సర్ బుక్లెట్లలో మార్పులు ఇవీ
ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు 24 పేజీలు, మిగిలిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్లను ఇవ్వనున్నారు. ద్వితీయ సంవత్సరంలో అన్ని సబ్జెక్టులకూ 24 పేజీల బుక్లెట్లే ఇస్తారు. అన్ని పేజీలు ఉన్నాయో లేదో విద్యార్థులు ముందుగానే చూసుకోవాలి. పేజీలను చించినట్టయితే విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్గా కేసు రాస్తారు.
పరీక్ష పేపరులో..
ఇప్పటి వరకూ జువాలజీ, బోటనీలకు చెరొక 60 మార్కుల చొప్పన థియరీ పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది రెండింటికీ కలిపి బయాలజీ పేరుతో 85 మార్కులకు నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రం ఒకటే అయినప్పటికీ జవాబులకు రెండు సబ్జెక్టులకు రెండు ఓఎంఆర్ షీట్లు ఇవ్వనున్నారు. గణితంలో 12, బోటనీలో 5, జువాలజీలో 4, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక మార్కు ప్రశ్నలు 9 చొప్పున ఇవ్వనున్నారు.
పాస్ మార్కులు ఎలా
ఏ సబ్జెక్టుకై నా ఉత్తీర్ణత శాతం 35. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు ప్రథమ సంవత్సరంలో 85 మార్కులకు 29, ద్వితీయ సంవత్సరంలో 85 మార్కులకు 30 మార్కులు కచ్చితంగా రావాలి. ద్వితీయ సంవత్సరం 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండగా 11 పాస్ మార్కులు రావాలి.
అంశం తూర్పు గోదావరి కాకినాడ అంబేడ్కర్ కోనసీమ పోలవరం మొత్తం
ప్రథమ విద్యార్థులు 22,500 22,010 13,131 2,619 60,260
ద్వితీయ విద్యార్థులు 20,603 20879 12,756 2,336 56,574
మొత్తం విద్యార్థులు 43,103 42,889 25,887 4,955 1,16,834
పరీక్షా కేంద్రాలు 52 58 40 10 160
ఇన్విజిలేటర్లు 317 465 332 150 1,264
డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 52 58 40 10 160
సూపరింటెండెంట్లు 52 58 40 10 160
ఫ్లయింగ్ స్క్వాడ్లు 3 3 2 3 11
సిట్టింగ్ స్క్వాడ్లు 3 3 3 1 10
స్టోరేజ్ పాయింట్లు 17 22 14 7 60
కంట్రోల్ రూమ్ నంబర్ 08832473430 9063553377 9550335191 9493259259
హాల్ టికెట్ల జారీ ఇలా..
కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే హాల్ టికెట్లు జారీ చేయాలి. తీసుకోని వారు బీఐఇ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. అందుకోసం మొదటి సంవత్సరం విద్యార్థులు పదో తరగతి హాల్ టికెట్ నంబరు లేదా ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వివరాలతోనూ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం హాల్ టికెట్ నంబర్తోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009కు హాయ్ అని మెసేజ్ చేస్తే వచ్చే వివరాల ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థీ.. విజయోస్తు
విద్యార్థీ.. విజయోస్తు
విద్యార్థీ.. విజయోస్తు


