అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు
బడ్జెట్లో అరకొర కేటాయింపులపై ఆవేదన
అమలాపురం టౌన్: స్థానిక ఐసీడీఎస్ కార్యాయలం ఎదుట అంగన్వాడీలు సోమవారం ధర్నా చేపట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ కార్యాయలం ఎదుటే రిలే నిరాహార దీక్షలు మొదలు పెట్టారు. అంగన్వాడీలకు కనీసం వేతనాలను పోరాడి సాధించాలని ధర్నాకు హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. ధర్నాకు అంగన్వాడీల యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి రత్నకుమారి నేతృత్వం వహించారు. రిలే నిరాహార దీక్షా శిబిరం నుంచి అంగన్వాడీలు పలు డిమాండ్లను నినాదాలు రూపంలో ఎలుగెత్తారు. పెండింగ్లో ఉన్న 1,810 మినీ వర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, హెల్పర్లకు పదోన్నతి కల్పించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంగన్వాడీలకు తీవ్ర అన్యాయం చేస్తూ అరకొర కేటాయింపులు చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సీ్త్ర శిశు సంక్షేమ శాఖకు కేవలం రూ.4,259 కోట్లు కేటయిస్తే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు, సిబ్బంది జీతాలకు ఎలా సరిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ల వద్ద ఈ నెల 26, 27 తేదీల్లో ఆందోళనలు చేయాలని రాష్ట్ర యూనియన్ పిలుపు ఇచ్చిన క్రమంలో జిల్లాలోని అంగన్వాడీలు అందుకు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షుడు భాస్కరరావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు పాము బాలయ్య, అంగన్వాడీ అండ్ హెల్పర్స్, వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు విజయ పాల్గొన్నారు.


