పరీక్షలకు పటిష్ట బందోబస్తు
ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం టౌన్: జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనా లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు కూడా పరీక్షల విషయంలో సమయ పాలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పరీక్షలు రాసే విద్యార్థులు కనీసం పది నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా పరీక్షలు చక్కగా రాయాలని, అందరూ ఉత్తీర్ణత సాధించాలని ఎస్పీ మీనా ఆకాంక్షించారు.
ఉయ్యాలవాడ త్యాగం
స్ఫూర్తిదాయకం
డీఆర్వో మాధవి
అమలాపురం రూరల్: భారతదేశం కోసం, ప్రజల హక్కుల కోసం తన ప్రాణాన్ని అర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి అన్నారు. ఆదివారం నరసింహారెడ్డి 179వ వర్ధంతిని కలెక్టరేట్లో నిర్వహించారు.
డీఆర్ఓ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర సమరంలో తొలి విప్లవ జ్యోతి వెలిగించిన మహా వీరుడు ఉయ్యాలవాడ అన్నారు. కలెక్టరేట్ ఏవో కె.కాశీవిశ్వేశ్వరరావు మాట్లాడుతూ నిరంకుశ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నరసింహారెడ్డి సాయుధ పోరాటం చేసి, తెలుగు వారి పౌరుషాన్ని చాటాడన్నారు.
కార్యక్రమంలో డివిజనల్ పీఆర్వో వీవీ రామిరెడ్డి, టెక్నికల్ సబార్డినేట్ బి నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
పరీక్షలకు పటిష్ట బందోబస్తు


