విఘ్నేశ్వరుని పాదాల చెంత లక్ష కలాలు
అయినవిల్లి: చదువుల పండగ పేరుతో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం రెండో రోజు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీయాగం నిర్వహించారు. ఈ పూజలు ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో 12 మంది రుత్వికుల పర్యవేక్షణలో జరిపారు. గణపతి పూజ, సరస్వతీ కల్పం, సరస్వతీ మండపారాధన, మహన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకం, శాంతి మంత్ర పఠనం, లక్షగరిక పూజ, లక్ష కలాల పూజ, పుష్పార్చన, సరస్వతీ హోమం జరిపారు. స్వామివారి ప్రసాదంగా లభించిన కలంతో విద్యార్థులు పరీక్షలు రాస్తే శుభ ఫలితాలు సాధిస్తారనే నమ్మకం. ఈ కలాల కోసం విద్యార్థులు భారీ ఎత్తున విఘ్నేశ్వరస్వామివారిని దర్శించి స్వామివారి కలాలను తీసుకెళ్తారు. 16 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈఓ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 25వ తేదీ నుంచి ఈ కలాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఈఓ తెలిపారు.


