పండగ ముసుగులో ఎమ్మెల్యే అక్రమ దందా
అమలాపురం టౌన్: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం తీర ప్రాంతంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అక్రమ వసూళ్లతో రూ.కోట్లలో అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. గత రెండేళ్లలో సంక్రాంతి సంబరాల ముసుగులో చేసిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురంలోని ప్రీతి రెసిడెన్సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతి, అక్రమ వసూళ్లపై ధ్వజమెత్తారు. గుండాటలు, కోడి పందేల బరులు ఏర్పాటు చేయించి అనేక మంది బ్రోకర్ల ద్వారా ఎమ్మెల్యే అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులు, షాపింగ్ మాల్స్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పలు ప్రభుత్వ శాఖలు, పలు సంస్థల నుంచి సంక్రాంతి ఉత్సవాల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. రూ.10 కోట్ల మేర సీఎస్ఆర్ నిధులను సంక్రాంతి సంబరాలకు తెచ్చానని చెబుతున్న ఎమ్మెల్యే.. చేసిన ఖర్చులకు లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. ఎస్.యానాం సంక్రాంతి సంబరాల వేదికపై టీవీ 9 విలేకరి అగ్ని ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారంటే.. అక్కడ సౌకర్యాలు ఎంత పేలవంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. అలాగే 18 ఏళ్లుగా అమలాపురంలో ఇద్దరు పంచాయితీరాజ్ డీఈఈలు బదిలీలు అనేవి లేకుండా ఇక్కడే తిష్టవేసి రూ.లక్షల అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఆ అధికారుల వివరాలను, వారు చేస్తున్న అవినీతిని మరో రెండు రోజుల్లో తాను వివరిస్తానని చెప్పారు. అమలాపురంలో డివిజన్ స్థాయి అధికారి భర్త కాంట్రాక్టర్గా మారి పనులు చేయిస్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు ఎలా దిగజార్చారో తేటతెల్లమవుతోందన్నారు. సమావేశఽంలో నాయకులు పెదపూడి బాబూరావు, జొన్నాడ బుజ్జి, మల్లవరపు శ్రీను, బడుగు శ్రీను, నేదునూరి వివేకానంద, ఉందుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రూ.కోట్లలో అవినీతికి
పాల్పడిన ఆనందరావు
ఫ సంక్రాంతి సంబరాల
పేరుతో భారీగా వసూళ్లు
ఫ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ధ్వజం


